నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య

Published Wed, Aug 26 2020 12:57 PM

Unknown Kills Petrol Pump Employee While Sleeping in Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: బాల్కొండ శివారులో జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్‌ బంకులో పనిచేసే కార్మికుడు నిద్రిస్తుండగా ఇనుప రాడ్లతో కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్‌ బంకులో బాల్కొండకు చెందిన కోటగిరి రాంకిషన్‌(49) కార్మికుడిగా పని చేస్తాడు. ఆదివారం విధులు నిర్వహించిన రాంకిషన్, తోటి కార్మికులు విధులకు రాక పోవడంతో సోమవారం కూడా డ్యూటీ చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా ఒక్కడే విధుల్లో ఉన్నాడు. అక్కడే ఉన్న కేబిన్‌లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వచ్చి తలపై ఇనుప రాడ్లతో కొట్టారు.

దీంతో తలకు తీవ్ర గాయాలై పడి ఉన్నాడు. మంగళవారం ఉదయం బంకుకు వచ్చిన మేనేజర్‌ రాజారెడ్డి గాయాలతో పడి ఉన్న రాంకిషన్‌ను చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కొనఊపిరితో ఉన్న ఆయనను ముందుగా అంబులెన్స్‌లో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్మూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతు డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పో లీసులు పేర్కొన్నారు. రాంకిషన్‌కు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు.  

డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు 
ఆర్మూర్‌ రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రాంకిషన్‌ హత్యకు గురైన ప్రదేశంలో పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. డాగ్‌ స్క్వాడ్‌ మండల కేంద్రంలోని ఎన్టీఆర్‌ కాలనీ వైపు వెళ్లి  ఆగిపోయింది. క్లూస్‌ టీంతో తనిఖీలు చేశారు. బాల్కొండ, ముప్కాల్‌ ఎస్సైలు శ్రీహరి, రాజ్‌భరత్‌రెడ్డి ఉన్నారు.   

Advertisement
Advertisement