కులం నుంచి వెలివేశారని వస్తే.. ఎస్సై బూతులు తిట్టారు..

Sub Inspector Harsh Behaviour On Woman In Karimnagar - Sakshi

సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్‌): తమను కులం నుంచి వెలివేశారని, న్యాయం చేయాలని ఠాణా మెట్లెక్కిన ఓ మహిళకు సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్సై లింగారెడ్డి నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఫిర్యాదు స్వీకరించకపోగా నానా బూతులు తిట్టి కుల పెద్దల వద్దే తేల్చుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చారని సదరు మహిళ పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌ మండలం నారాయణపూర్‌ గ్రామానికి చెందిన బోయవాల్మీకి కులానికి చెందిన ముస్తే సునీత కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు.

అప్పటినుంచి ఆ కులంలోని ఎవ్వరి ఇళ్లలో శుభకార్యాలు జరిగినా వీరిని పిలవడం లేదు. తమ తప్పులేదని మొత్తుకున్నా కులపెద్దలు వినడం లేదు. దీంతో సదరు మహిళ ఫిర్యాదు చేసేందుకు శనివారం సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన గోడును రెండో ఎస్సై లింగారెడ్డితో చెప్పుకుంటుండగా ఒక్కసారిగా దుర్భాషలాడారని ఆరోపించింది. ఆయన తిట్టిన బూతులకు మనస్తాపం చెందిన ఆమె పోలీస్‌స్టేషన్‌ ఎదుటే బైఠాయించింది.

ఎస్సై ఉపేందర్‌రావు బాధితురాలితోపాటు రెండో ఎస్సైని పిలిచి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కుల పెద్దల నుంచి తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై లింగారెడ్డి స్పందిస్తూ.. తాను కించపరిచేలా మాట్లాడలేదని పేర్కొన్నారు.  

చదవండి: RS Praveen kumar: సీఎంగా కేసీఆర్‌ ఏడేళ్లు ఏం చేశారు..? 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top