శశికళతో మాట్లాడాడని.. కారుపై పెట్రోలు పోసి

Sasikala Phone Conversation With AIADMK Leader Unknown People Burn His Car - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళతో ఫోన్‌లో మాట్లాడారని అన్నాడీఎంకే నేత కారును గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ సంఘటన రామనాథపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన శశికళ ఇటీవల మళ్లీ ఉత్సాహం చూపుతున్నారు. అన్నాడీఎంకే నేతలతో టచ్‌లో ఉంటున్నారు. అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

రామనాథపురం జిల్లా అన్నాడీఎంకే ఎంజీఆర్‌ యువజన విభాగం కార్యదర్శిగా కొన్నాళ్లు పనిచేసిన విన్సెంట్‌ రాజాతో శశికళ ఇటీవల మాట్లాడారు. ఈ ఆడియా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో అన్నాడీఎంకే అధిష్టానం విన్సెంట్‌ రాజాను పార్టీ నుంచి బహిష్కరించి ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది. కాగా విన్సెంట్‌ రాజాకు పరమకుడి సమీపంలోని మేలక్కావనూరు గ్రామంలో కాంక్రీట్‌ మిక్సింగ్‌ కంపెనీ ఉంది.

ఇక్కడి సెక్యూరిటీ గార్డు ఆదివారం రాత్రి విధులకు రాలేదు. కంపెనీ ప్రాంగణంలో కారును పార్క్‌ చేసి అక్కడి గదిలో విన్సెంట్‌ రాజా నిద్రించాడు. సోమవారం తెల్లవారుజాము 2.45 గంటల సమయంలో పెద్దగా శబ్దం రావడంతో బయటకు వచ్చి చూశారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కారుపై పెట్రోలు పోసి తగలబెడుతున్నారు. విన్సెంట్‌ను చూడగానే పారిపోయారు. విన్సెంట్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చదవండి: దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top