వ్యక్తి దారుణ హత్య | Man Brutally Murdered By Unknown Person In Mulakalacheruv | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Aug 22 2022 10:51 PM | Updated on Aug 22 2022 10:51 PM

Man Brutally Murdered By Unknown Person In Mulakalacheruv - Sakshi

ములకలచెరువు: ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ములకలచెరువు మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవులచెరువు పంచాయతీ గోళ్లవారిపల్లెకు చెందిన పసుపులేటి శ్రీనివాసులు(32), భార్య శోభా దంపతులు ములకలచెరువులోని ఒక టమాట మార్కెట్‌యార్డులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు.

వీరికి కుమార్తె వర్షా(17), కుమారుడు మునిచరణ్‌(5) ఉన్నారు. శనివారం భార్య శోభా తన భర్త తల్లి పసుపులేటి సాలెమ్మతో కలిసి టమాట పొలంలో పనులకు వెళ్లింది. పసుపులేటి శ్రీనివాసులు మాత్రం యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. రోజూ చుట్టు పక్కల కూలీలను ప్రత్యేక వాహనంలో ఇళ్ల వద్ద వదిలేసి వచ్చేవారు. కానీ శ్రీనివాసులు వాహనంలో పోలేదు. ఏమైందో కానీ ఉదయం గోళ్లవారిపల్లె సమీపంలోని పొలాల్లో శవమై కనిపించాడు.

అటువైపు వెళ్లే ప్రయాణికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం చేరవేశారు. మదనపల్లి డీఎస్పీ రవిమనోహరచారి, సీఐ శివాంజనేయులు, ఎస్‌ఐ డీవై స్వామి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తలపై రాయితో మోదడంతో ప్రాణాలు కోల్పోయి నుజ్జునుజ్జుగా మారి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

మార్కెట్‌లో తనతో పాటు పని చేసే వేణుగోపాల్, శంకరపైన అనుమానం ఉన్నట్లు తల్లి సాలెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement