పెళ్లింట విషాదం: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. వరుడి పరిస్థితి విషమం

Jeep Carrying Groom And His Family Hits Truck In UP Several Killed - Sakshi

లఖ్‌నవూ: కొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. పెళ్లి కోసం అంతా సిద్ధం చేసుకుని వధువు ఇంటికి బయలుదేరిన వరుడు తరపు బంధువులను మార్గ మధ్యలోనే మృత్యువు కబళించింది. ట్రక్కు రూపంలో వారికి మృత్యువు ఎదురైంది. వారు వెళ్తున్న జీపు ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతెపుర్‌ సిక్రి సమీపంలో ఆగ్రా-జైపూర్‌ హైవేపై శనివారం తెల్లవారు జామున 5 గంటలకు జరిగింది. జీపు డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకోవటంతో కొరాయి టోల్‌ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. టోల్‌ ప్లాజా సిబ్బంది, స్థానికులు హుటాహుటిన స్పందించి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. 

రాజస్థాన్‌లోని అజ్మెర్‌కు చెందిన వరుడి కుటుంబం పెళ్లి కోసం బిహార్‌లోని పట్నాకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వరుడి కుటుంబంలోని ముగ్గురు చనిపోగా.. జీపు డ్రైవర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్షతగాత్రులు ఆగ్రాలోని సీహెచ్‌సీ, ఎస్‌ఎన్‌ మెడికల్‌ కళాశాలలో చికిత్స పొందుతున్నట్లు ఆగ్రా ఎస్పీ సత్యజీత్‌ గుప్తా తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఢిల్లీ అల్లర్ల కేసులో నిర్దోషిగా జేఎన్‌యూ స్టూడెంట్‌ లీడర్‌ ఉమర్‌ ఖలిద్‌!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top