
చిక్కబళ్లాపురం: జిల్లాలోని బాగేపల్లి తాలూకా మరసనహళ్లి గ్రామంలో నివాసముంటున్న రాజమ్మ అనే మహిళ ఆడబిడ్డను ఎవరైనా దత్తత తీసుకోండి అని ప్రాధేయ పడుతోంది. భర్త లక్ష్మినారాయణ వేధింపులే ఇందుకు కారణం. వీరికి ఒక ఆడకూతురు ఉంది. ఇటీవల రెండో కాన్పులోను ఆడ శిశువు జన్మించింది. అప్పటినుంచి భర్త, అత్తమామలు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని తెలిపింది.
చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పసికందుతో వచ్చి తన బిడ్డను ఎవరైనా దానం తీసుకోవాలని మొర పెట్టుకుంది. ఆమె దీనస్థితిని చూసినవారి కళ్లు చెమర్చాయి. తల్లిదండ్రులు లేని రాజమ్మ ఇటు భర్త ఆసరా లేక, ఇద్దరు బిడ్డలను పోషించేదెలా అని వాపోయింది. తాను గర్భిణిగా ఉండగా భర్త బాగా చూసుకొనేవారు, మగపిల్లాడు పుడతాడని చాలా ఆశతో ఉన్నారు, అయితే ఆడబిడ్డ పుట్టగానే తాత్సారంగా చూస్తున్నారు, నాకు చాలా బాధ కలుగుతోంది అని ఆమె విలపించారు.