● ఆపసోపాలు పడుతున్న లబ్ధిదారులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
జిల్లాలో ఇళ్ల నిర్మాణం కొండెక్కింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక పేదవాడి
సొంతింటి కల నెరవేరకుండా పోయింది.
రెండేళ్లుగా కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లూ మంజూరు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకూ నిధులు మంజూరు చేయకుండా
మొండికేస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ ఇళ్లు అక్కడే ఆగిపోయాయి. వెక్కిరిస్తున్న
మొండిగోడలను చూసి లబ్ధిదారులు
కన్నీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో కాలనీ ఇళ్ల నిర్మాణాలపై
సాక్షి ప్రత్యేక కథనం.
పలమనేరు మున్సిపాలిటీలోని బొమ్మిదొడ్డి లేఅవుట్లో ఆగిన ఇళ్ల నిర్మాణాలు
మొత్తం లేఅవుట్లు
609
పలమనేరు: జిల్లాలో కాలనీ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టనేలేదు. గత ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో ఆగిన ఇంటి నిర్మాణ పనులకు సక్రమంగా బిల్లులందక అవి కొండెక్కాయి. ఇంతవరకు నిర్మాణాలు చేపట్టని మూడు వేల ఇళ్లను గతంలో రద్దు చేస్తూ ఆన్లైన్లో వారి వివరాలను డిలీట్ చేసింది. దీంతో ఇప్పటిదాకా ఇళ్లను కట్టుకోలేని నిరుపేదలకు ఇక కేటాయించిన స్థలాలు పోయినట్టే. మరోవైపు పీఎం ఆవాజ్ యోజనలో నిర్మించిన ఇళ్లను కూటమి ప్రభుత్వం చేసినట్టు బిల్డప్ ఇచ్చారే గానీ ఇప్పటిదాకా ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టలేదు.
గత ప్రభుత్వంలో పేదల కల సాకారం
సొంతిల్లు కట్టుకోవాలన్నదే ప్రతి పేదవాని కల. ఆ కలను నిజం చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. జిల్లాలో 77,365 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 609 జగనన్న లేఅవుట్లున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,719 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా 2,389 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 4,330 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఆగిపోయింది. ఇందులో ఇప్పటికీ నాట్ స్టాటెడ్గా ఉన్న 3వేల ఇళ్లను ఆన్లైన్లో తొలగించింది.
ఈ నెలఖరులో రావచ్చు
కొత్త గృహాల విషయమై హౌసింగ్ అధికారులను వివరణ కోరగా.. ఇప్పటికీ అర్జీలు స్వీకరించి వాటిని ఆన్లైన్ చేశామన్నారు. ఈ నెలాఖరులో లబ్ధిదారులకు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జిల్లా సమాచారం
పూర్తయిన ఇళ్లు
46,163
ఖర్చుచేసిన మొత్తం రూ.1000.687 కోట్లు
ప్రస్తుతం వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లు
31,203


