
వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఆయన సోమవారం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 8వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.1000 చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారని వెల్లడించారు. వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికారులను ఆదేశించారు. వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలకంరించాలని సూచించారు. పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసరాలు, రోడ్లు, సమీప ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. ట్రాఫిక్, సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం
వరలక్ష్మి వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థాన మండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాల్లో పెండాల్స్, సూచిక బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబు స్వామి, మణికంఠ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, అన్నదానం డిప్యూటీ ఈవో సెల్వం, వీజీవో సురేంద్ర పాల్గొన్నారు.