
అయ్యా.. బాబూ!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బదిలీల సమాచారం
● ఉమ్మడి చిత్తూరులో అయ్యోర్లకు జీతాల సమస్య
● పొజిషన్ ఐడీ లేక అయోమయం
● రెండు నెలలుగా అవస్థలు
యాజమాన్యం ఖాళీలు
ప్రభుత్వ 125
ఎంపీపీ/ జెడ్పీ 1,583
మున్సిపల్ కార్పొరేషన్ 135
మున్సిపల్ 75
5/8 ఏళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్లు 3,000
మిగిలు పోస్టులు 500
రీ అపోర్షన్/షిప్టెడ్ 1,582
మొత్తం 7,000
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 4,737 ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, నగరపాలక, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 18,540 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నిర్వహించిన బదిలీల కసరత్తులో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7 వేల మంది టీచర్లను బదిలీ చేశారు. అదేవిధంగా హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు 800 వరకు ఉన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతులు పొందిన పలు కేడర్ల టీచర్లు రెండు నెలలుగా జీతాలు లేక అవస్థలు ఎదుర్కుంటున్నారు. జీతాల కోసం నిత్యం డీఈవో కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమ చేతుల్లో ఏమీ లేదని విద్యాశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
పొజిషన్ ఐడీ పేరుతో కక్ష
పొజిషన్ ఐడీ పేరుతో టీచర్ల పట్ల కూటమి ప్రభుత్వం జీతాలు మంజూరు చేయకుండా కక్ష సాధింపులకు దిగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెరపైకి పొజిషన్ ఐడీ పేరును తీసుకొచ్చింది. ఏదో ఒక విధంగా టీచర్లను ఇబ్బందులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.
కేబినెట్ ఆమోదం అవసరమట
పొజిషన్ ఐడీలకు కేబినెట్ ఆమోదం అవసరమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఉపాధ్యాయ సంఘ నేతలు మండిపడుతున్నారు. కేబినెట్ ఆమోదం పేరుతో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టించడం సబబు కాదని హెచ్చరిస్తున్నారు. అసలు పొజిషన్ ఐడీల ఫైల్ కేబినెట్లో ఆమోదం పొందిందో...లేదో అనే విషయం తెలియడం లేదని, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 వేల మంది టీచర్లు జీతాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వాపోతున్నారు. పెండింగ్ జీతాల బిల్లులు పెట్టుకునేందుకు ఈ నెల 27 వరకు రాష్ట్ర ట్రెజరీ అధికారులు అవకాశం కల్పించారని, అయితే పొజిషన్ ఐడీలు లేకపోవడంతో టీచర్లు బిల్లులు నమోదు చేయలేక మిన్నకుంటున్నట్టు తెలిపారు.
అయ్యోర్ల నిరసన
జీతాల కోసం ఉపాధ్యాయులు శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనకు దిగారు. వేతనాల సమస్యను వెంటనే పరిష్కరించాలని రోడ్డెక్కారు. బదిలీలు చేపట్టి రెండు నెలలు కావొస్తున్నా పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. తాజాగా కేబినెట్ భేటీ నిర్వహించినప్పటికీ అందులో పొజిషన్ ఐడీల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్యాయం
పొజిషన్ ఐడీలు ఇవ్వకుండా ఆలస్యం చేయడం అన్యాయం. నెలల తరబడి ఐడీల పేరుతో జీతాలు ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదు. ఈ సమస్య రాష్ట్ర మొత్తం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది టీచర్లు పొజిషన్ ఐడీ సమస్యతో రెండు నెలల జీతాలు పొందలేకపోయారు. పలు మార్లు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా అలసత్వం వహించడం సబబు కాదు. – బాలాజీ, ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు
పొజిషన్ ఐడీలు మంజూరు చేయాలి
పొజిషన్ ఐడీలు ఇచ్చేందుకు నెలల సమయం అవుతుందా..?. టీచర్ల పట్ల ఇంత చులకన భావన ఎందుకో. రెండు నెలల జీతాలు లేకపోవడంతో టీచర్లు అవస్థలు పడుతున్నారు. కేడర్ స్టెన్త్ నివేదికలు సిద్ధం చేసి పొజిషన్ ఐడీలు ఇవ్వడం పట్ల అలసత్వం వహించడం దారుణం. ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారని అనిపిస్తోంది.
– జీవీ రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి

అయ్యా.. బాబూ!

అయ్యా.. బాబూ!

అయ్యా.. బాబూ!

అయ్యా.. బాబూ!