దేశం వీడుతున్న సంపన్నులు | Why Rich Indians Are Leaving know the reasons | Sakshi
Sakshi News home page

దేశం వీడుతున్న సంపన్నులు

Nov 28 2025 3:56 PM | Updated on Nov 28 2025 4:43 PM

Why Rich Indians Are Leaving know the reasons

భారత్‌లోని చాలామంది అత్యంత ధనవంతులు దేశాన్ని వదిలివెళ్తున్న ధోరణి పెరుగుతోంది. దీనికి కారణం పన్నుల నుంచి తప్పించుకోవడం కాదని.. ఇతర అవసరాలున్నాయని ప్రముఖ ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అక్షత్‌ శ్రీవాస్తవ అన్నారు. ధనవంతులు తమ కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని, భద్రతను, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే కోరికతోనే దేశం విడిచి పోతున్నారని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

సంపన్న వర్గాలైన హై నెట్ వర్త్ వ్యక్తులు (HNI) విదేశాలకు మకాం మారుస్తుండడంపై కారణాలు తెలుసుకునేందుకు వెళ్లిన వారితో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చాలా మంది సంపన్నులు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణాలు కింది విధంగా ఉన్నాయి.

  • నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రధానం. దాదాపు 15 ఏళ్ల కిందట పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అందులో ఎలాంటి మార్పు లేదు. ఈ పరిస్థితులు ఇంకా దిగజారాయి.

  • కుటుంబం, పిల్లల భద్రత గురించి చాలా మంది దేశం వీడుతున్నారు.

  • పిల్లలకు ఉన్నత విద్యా, వృత్తిపరమైన అవకాశాలను కల్పించాలనే తపనతో కొందరు ఇతర దేశాలకు వెళ్తున్నారు.

  • దేశంలో మౌలిక సదుపాయాల అంతరాలు, అధిక పని భారంతో కూడిన న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థాగత సమస్యలతో కొందరు బయటకు పోతున్నారు.

ఈ ధనిక పన్ను చెల్లింపుదారులు దేశం విడిచి వెళ్లడం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా పరిణమించవచ్చని శ్రీవాస్తవ హెచ్చరించారు. ‘భారతదేశంలో 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తున్నారు. ఒక హోచ్‌ఎన్‌ఐ పన్ను చెల్లింపుదారుడు దేశం నుంచి వెళ్లిపోతే మిగిలిన 98% మందికి ఇది పెద్ద నష్టం. అంటే, దేశంలో పన్ను చెల్లింపుదారులు అతి తక్కువగా ఉన్న తరుణంలో ఎక్కువ పన్నులు చెల్లించే సంపన్న వర్గం నిష్క్రమిస్తే ప్రభుత్వంపై, మిగిలిన ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుంది’ అన్నారు.

ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

Advertisement
 
Advertisement
Advertisement