5 కంపెనీలుగా వేదాంతా! | Vedanta is set to split into five separately listed companies | Sakshi
Sakshi News home page

5 కంపెనీలుగా వేదాంతా!

Apr 21 2026 5:07 AM | Updated on Apr 21 2026 6:58 AM

Vedanta is set to split into five separately listed companies

మే 1 నుంచి అమల్లోకి... 

బిజినెస్‌ల విడదీతకు బోర్డు ఓకే 

1:1 నిష్పత్తిలో షేర్ల కేటాయింపు 

విడదీసిన 4 కంపెనీల లిస్టింగ్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా మే 1 నుంచి 5 కంపెనీలుగా విడిపోనుంది. దీంతో అల్యూమినియం, మర్చంట్‌ పవర్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ముడిఇనుము విభాగాలు ప్రత్యేక లిస్టెడ్‌ కంపెనీలుగా విడిపోనున్నాయి. వెరసి స్వతంత్ర కంపెనీలుగా వేదాంతా అల్యూమినియం మెటల్‌ (వీఏఎంఎల్‌), తల్వాండి సాబో పవర్‌ (టీఎస్‌పీఎల్‌), మాల్కో ఎనర్జీ(ఎంఈఎల్‌), వేదాంతా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ (వీఐఎస్‌ఎల్‌) ఏర్పాటు కానున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత వేదాంతా (మాతృ సంస్థ) లిస్టెడ్‌ కంపెనీగా కొనసాగనుంది. 

విడదీత (డీమెర్జర్‌) మే 1నుంచి అమల్లోకి వచ్చేందుకు సోమవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వేదాంతా వెల్లడించింది. విడదీయనున్న బిజినెస్‌లతో సంప్రదించాక రికార్డ్‌ డేట్‌ను నిర్ణయించినట్లు తెలియజేసింది. ఈ పథకం ప్రకారం అర్హులైన వేదాంతా వాటాదారులకు 1:1 నిష్పత్తిలో ఇతర కంపెనీల షేర్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలియజేసింది. స్వతంత్ర బిజినెస్‌లుగా ఏర్పాటుకావడం ద్వారా సంబంధిత రంగాలపైనే దృష్టి సారించేందుకు వీలుంటుందని వేదాంతా పేర్కొంది. దీంతో వెల్త్‌ ఫండ్స్‌ తదితర గ్లోబల్‌ ఇన్వెస్టర్లు, రిటైలర్లు, వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు ప్రత్యేకించిన రంగాలలో  పెట్టుబడులకు అవకాశం ఉంటుందని వివరించింది.  

ఇతర వివరాలివీ...
అల్యూమినియం సంబంధిత మారి్పడిరహిత డిబెంచర్లను(ఎన్‌సీడీలు) వీఏఎంఎల్‌కు బదిలీ చేయనున్నట్లు వేదాంతా వెల్లడించింది. వీటితోపాటు భారత్‌ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో వాటాలు సైతం బదిలీ చేయనుంది. అంతేకాకుండా తల్వాండీ సాబో పవర్‌ను వేదాంతా పవర్‌(వీపీఎల్‌)గా, మాల్కో ఎనర్జీని వేదాంతా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌(వీఓజీఎల్‌)గా మార్పు చేయనున్నట్లు పేర్కొంది.  
ఈ నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్‌ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 771 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement