ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంచలన అడుగు వేసింది. ప్రపంచ ప్రసిద్ధ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ భాగస్వామ్యంతో ఎంటర్ప్రైజ్ ఏఐ స్కేలింగ్ను వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఐటీ రంగంలో సాంప్రదాయ శ్రమ-ఆధారిత నమూనాపై జనరేటివ్ ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల నడుమ టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
50,000 మంది ఉద్యోగులకు ‘క్లాడ్ ఏఐ’ శిక్షణ
ఈ వ్యూహాత్మక కూటమిలో భాగంగా ఆంత్రోపిక్ సంస్థకు చెందిన అత్యాధునిక ఏఐ మోడల్ ‘క్లాడ్’ వినియోగంలో దాదాపు 50,000 మంది టీసీఎస్ అసోసియేట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్కేర్ వంటి కఠినమైన నిబంధనలు ఉండే రంగాల కోసం ఇరు సంస్థలు సంయుక్తంగా సరికొత్త ఏఐ పరిష్కారాలను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. క్లాడ్ ఏఐకి ఉన్న డేటా సెక్యూరిటీ, అక్యూరసీ ఫీచర్లు కార్పొరేట్ క్లయింట్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు దోహదపడతాయని కంపెనీ అధికారులు భావిస్తున్నారు.
పెట్టుబడిదారుల ఆందోళనలు
భారతదేశానికి చెందిన సుమారు 315 బిలియన్ డాలర్ల ఐటీ రంగం ప్రస్తుతం ఒక కీలక సంధిగ్ధ దశను ఎదుర్కొంటోంది. సాంప్రదాయ కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ వంటి శ్రమ-ఆధారిత పనులను ఏఐ సాధనాలు భర్తీ చేస్తే ఐటీ కంపెనీల ఆదాయ నమూనా దెబ్బతింటుందనే భయాలు పెట్టుబడిదారులలో నెలకొన్నాయి.
శ్రామిక శక్తిలో మార్పులు
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మంగళవారం జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) భవిష్యత్తు వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కంపెనీ శ్రామిక శక్తిలో మానవ ఉద్యోగులు ఎంతమంది ఉంటారో, అంతే సంఖ్యలో ఏఐ ఏజెంట్లు కూడా ఉండేలా టీసీఎస్ అడుగులు వేస్తోంది. ఈ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో కొత్త నియామకాల వేగం మందగించే అవకాశం ఉందని చంద్రశేఖరన్ సంకేతాలిచ్చారు.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు!


