
రూ. 17,200 కోట్ల సమీకరణకు రెడీ
11 బిలియన్ డాలర్ల విలువపై కన్ను
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా మొత్తం 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్సీ 3.58 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనున్నాయి.
తద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉంది. వెరసి కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లుగా నమోదుకానున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి. నెలాఖరు(30)కల్లా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నట్లు అంచనా. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాలకుగాను టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది.
లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది. 2023 నవంబర్లో టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, తిరిగి టాటా గ్రూప్ నుంచి మరో దిగ్గజం ఐపీవోకు రానుండటం ప్రస్తావించదగ్గ అంశం! 2022 సెపె్టంబర్లో అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2025 సెపె్టంబర్లోగా ఐపీవో చేపట్టవలసి ఉంది. ఇప్పటికే అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీలు.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్(హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థ), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే.