
దేశవ్యాప్తంగా ఉన్న మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ లో క్యాష్ లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయాన్ని టాటా ఏఐజీ (Tata AIG) జనరల్ ఇన్సూరెన్స్ నిలిపివేసింది. దీనికి ముందు స్టార్ హెల్త్, నివా బుపా ఇప్పటికే మ్యాక్స్ ఆసుపత్రులలో నగదు రహిత క్లెయిమ్ సెటిల్మెంట్లను ఉపసంహరించుకున్నాయి.
తమ మధ్య కుదిరిన రెండేళ్ల ఒప్పందం కొనసాగుతుండగానే టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ టారిఫ్ల తగ్గింపునకు డిమాండ్ చేసిందని మ్యాక్స్ హెల్త్ కేర్ (Max Hospitals) ఆస్పత్రుల యాజమాన్యం ఆరోపిస్తోంది. "మ్యాక్స్ హెల్త్ కేర్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ చర్చలు జరిపి 2025 జనవరి 16 నుండి 2027 జనవరి 15 వరకు అమలులోకి వచ్చే రెండేళ్ల టారిఫ్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే, 2025 జూలైలో టాటా ఏఐజీ అకస్మాత్తుగా సమావేశాన్ని కోరి రేట్ల తగ్గింపును డిమాండ్ చేసింది" అని మ్యాక్స్ హెల్త్ కేర్ ప్రతినిధి తెలిపారు.
"వారు ఏకపక్షంగా టారిఫ్ల తగ్గింపును ప్రతిపాదించారు. నగదు రహిత సేవలను నిలిపివేస్తామని బెదిరించారు. మేము దానికి అంగీకరించకపోవడంతో మా ఆసుపత్రులలో నగదు రహిత సేవలను 2025 సెప్టెంబర్ 10 నుండి నిలిపివేశారు" అని మ్యాక్స్ హెల్త్ కేర్ ప్రతినిధి వివరించారు.
ముందస్తు చెల్లింపులు అవసరం లేదు
అయితే రోగులపై ప్రభావాన్ని తగ్గించడానికి, బీమా సంస్థలతో రీయింబర్స్మెంట్లను దాఖలు చేయడంలో వారికి సహాయపడటానికి ఎక్స్ ప్రెస్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు మ్యాక్స్ హెల్త్ కేర్ తెలిపింది. తద్వారా రోగులు మ్యాక్స్ ఆసుపత్రులలో ముందస్తు చెల్లింపులు చేయవలసిన అవసరం లేదంటోంది.
ఈ దశలో, ఈ విషయంపై టాటా ఏఐజీతో ఎలాంటి చర్చలు జరపడం లేదని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. టాటా ఏఐజీతో టారిఫ్ వివాదం లేదని, ఛార్జీలలో అదనపు తగ్గింపు ఆచరణీయం కాదని హెల్త్కేర్ ప్రొవైడర్ పేర్కొంది. ఇది రోగి భద్రత, సంరక్షణ నాణ్యత రెండింటినీ రాజీ పడేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
మ్యాక్స్ ఆస్పత్రుల్లో నివా బుపా (Niva Bupa) , స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (Star Health) సంస్థలు ఇప్పటికే క్యాస్ లెస్ క్లెయిమ్ సదుపాయాలను ఇప్పటికే నిలిపివేయగా ఇప్పుడు టాటా ఏఐజీ కూడా వాటితో చేరింది. గత మేలో మ్యాక్స్తో ఒప్పందం ముగిసిన తరువాత టారిఫ్ చర్చల సమయంలో ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైందని పేర్కొంటూ నివా బుపా 2025 ఆగస్టు 16 నుండి దేశం అంతటా అన్ని మాక్స్ ఆసుపత్రులలో తమ నగదు రహిత క్లెయిమ్లను నిలిపివేసింది. మరోవైపు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (CARE Health Insurance) కూడా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని మ్యాక్స్ ఆసుపత్రులలో నగదు రహిత క్లెయిమ్ సెటిల్మెంట్ను నిలిపివేసింది.
ఇదీ చదవండి: పీఎఫ్ విత్డ్రా డబ్బు దేనికి వాడుతున్నారు? ఈపీఎఫ్వో వార్నింగ్!