
ప్రముఖ ఎన్బీఎఫ్సీ సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ బంగారం రుణాల్లో తన మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. బంగారం రుణాల మార్కెట్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు అవుతుందన్న అంచనాల నేపథ్యంలో.. మరిన్ని శాఖల్లో బంగారం రుణాలను ప్రవేశపెట్టనున్నట్టు సంస్థ డిప్యూటీ ఎండీ అన్బుసెల్వన్ తెలిపారు.
‘2024–25 మూడో త్రైమాసికంలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శ్రీరామ్ ఫైనాన్స్ నిర్వహణలోని బంగారం రుణ ఆస్తులు (ఏయూఎం) గణనీయంగా పెరిగాయి. మరింత స్థిరీకరణతో రానున్న త్రైమాసికాల్లో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా మరిన్ని శాఖలకు బంగారం రుణాల వ్యాపారాన్ని విస్తరించనున్నాం’అని అన్బుసెల్వన్ వివరించారు. బంగారం రుణాలకు డిమాండ్ పెరిగిందని.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు వేగంగా నిధులు కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: విమాన ప్రయాణాలు మరింత భారం
సంఘటిత రంగంలో బంగారం రుణ వ్యాపారం మరింత విస్తరించనున్నట్టు అన్బుసెల్వన్ తెలిపారు. తమ బంగారం రుణ కస్టమర్లలో ఎక్కువ మంది మధ్యతరగతి వారేనని, వేతన జీవులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల్లోని వర్తకులు ఇందులో ఉన్నట్టు చెప్పారు. ఏక మొత్తంలో రుణ చెల్లింపులు, మూడు నెలలకోసారి వడ్డీ చెల్లించడం, నెలవారీ ఈఎంఐ ఇలా పలు రూపాల్లో బంగారం రుణాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. వేగంగా రుణాలు జారీ చేసేందుకు వీలుగా ప్రక్రియలను ఆటోమేట్ చేసినట్టు పేర్కొన్నారు.