3 రోజుల్లో 1,000 పాయింట్లు అప్‌ | Sensex gains 1,000 points in 3 consecutive days | Sakshi
Sakshi News home page

3 రోజుల్లో 1,000 పాయింట్లు అప్‌

Nov 4 2020 3:59 PM | Updated on Nov 4 2020 4:01 PM

Sensex gains 1,000 points in 3 consecutive days - Sakshi

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 355 పాయింట్లు జంప్‌చేసి 40,616 వద్ద నిలిచింది. నిఫ్టీ 95 పాయింట్ల వృద్ధితో 11,909 వద్ద స్థిరపడింది. వెరసి 12,000 పాయింట్ల మార్క్‌ చేరువలో నిఫ్టీ ముగిసింది. ఇక గత 3 రోజుల్లో సెన్సెక్స్‌ 1,000 పాయింట్లను జమ చేసుకోవడం గమనార్హం! అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యమిచ్చారు. అయితే మిడ్‌సెషన్‌లో కొంతమేర లాభాల స్వీకరణ జరగడంతో మార్కెట్లు వెనకడుగు వేసినట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో 40,693 ఎగువన గరిష్టానికి చేరిన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌లో 40,077 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 11,930- 11,756 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంది. 

బ్యాంక్స్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా 2.2 శాతం, ఐటీ 1.8 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో ఆటో 0.7 శాతం, బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే రియల్టీ దాదాపు 2 శాతం క్షీణించగా.. మెటల్‌ 0.3 శాతం బలహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, సన్‌ ఫార్మా, దివీస్‌, ఆర్‌ఐఎల్‌, సిప్లా, ఇన్ఫోసిస్‌, విప్రో, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బ్రిటానియా 5-2 శాతం మధ్య వృద్ధి చూపాయి. ఇతర బ్లూచిప్స్‌లో యూపీఎల్‌, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హిందాల్కో, పవర్‌గ్రిడ్‌, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌ 4-1 శాతం మధ్య డీలాపడ్డాయి.

గోద్రెజ్‌ ప్రాపర్టీస్ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో అపోలో టైర్‌, గ్లెన్‌మార్క్‌, హావెల్స్‌, పేజ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, జిందాల్‌ స్టీల్‌, కోఫోర్జ్‌, సీమెన్స్‌ 3.5-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, వేదాంతా, ముత్తూట్‌, భెల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఇండిగో, ఫెడరల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ 6-2 శాతం​మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,282 లాభపడగా.. 1,310 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,274 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1101 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 741 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 534 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement