చదువు కొంటున్నారా? | Sakshi Special Story About Private schools Education sysstem | Sakshi
Sakshi News home page

చదువు కొంటున్నారా?

Jun 9 2025 4:39 AM | Updated on Jun 9 2025 9:59 AM

Sakshi Special Story About Private schools Education sysstem

నాణ్యమైన విద్య.. అందని ద్రాక్ష కాదు..! ఏటేటా భారీగా  పెరిగిపోతున్న ఫీజులు  పాఠశాల విద్యకే రూ.లక్షలాది ఖర్చు విదేశీ విద్యకు భారీగా వెచ్చించాల్సిందే ముందస్తు ప్రణాళికతో సాధించడం సులభమే పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు–సంస్కారం. అందుకే తల్లిదండ్రులు ఖర్చుకు వెనుకాడకుండా పిల్లలను మంచి పాఠశాలల్లో చేర్పించేందుకు తమ వంతు  ప్రయత్నిస్తుంటారు.

కానీ, నాణ్యమైన విద్య నేడు అందరికీ అందుబాటులో లేదు.  పాఠశాల స్థాయి నుంచే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎల్‌కేజీ,  యూకేజీలకు రూ.లక్షల ఫీజులు తీసుకుంటున్న పాఠశాలలు చాలానే ఉన్నాయి. ఉన్నత విద్యకు ఇంకా అధిక మొత్తమే వెచ్చించాల్సి వస్తోంది. నాణ్యమైన చదువుల కోసమని ఈ స్థాయి ఖర్చును భరించడం మధ్యతరగతి వారికి ముందస్తు ప్రణాళికతోనే సాధ్యం.

గడిచిన దశాబ్ద కాలంలో స్కూలు ఫీజులు 150–200 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్, బెంగళూరులో పేరున్న పాఠశాలలు 30 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. సాధారణ ద్రవ్యోల్బణం 6 శాతమే. కానీ విద్యా ద్రవ్యోల్బణం 11–12 శాతం వరకు ఉంటోంది. అంటే ఫీజులు ఏటా ఈ స్థాయిలో, ఇంతకుమించి పెరుగుతున్నాయి. దీనికి అదనంగా ట్యూషన్లు, క్రీడల్లో కోచింగ్, సంగీతం/కళలు, పుస్తకాలు, బస్సు రవాణా రూపంలో అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఐఐటీల్లోనూ నాలుగేళ్ల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

పాఠశాల చదువు తర్వాత ఐఐటీలు, ఐఐఎంలు, నిట్, బిట్‌ తదితర ప్రఖ్యాత సంస్థల్లో సీటు రాకపోతే.. ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా ఈ ఫీజులు ఏటేటా పెరుగుతూ పోతున్నాయి. పాఠశాల స్థాయిలో చేసే ఖర్చుకు అదనంగా.. మరోవైపు వారి ఉన్నత విద్యకోసం కావాల్సినంత సమకూర్చుకునేందు కు ప్రాధా న్యం ఇవ్వాల్సిందే. ఇందుకు ముందస్తు వ్యూహం, ప్రణాళిక తప్పకుండా అవసరం.  

ప్రణాళిక.. 
విద్యా వ్యయాలను భరించాలంటే అది ముందస్తు ప్రణాళికతోనే సాధ్యమని సరి్టఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ హర్‌‡్షవర్ధన్‌ రుంగ్తా పేర్కొన్నారు. విదేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్స్‌ (ఫీజులు, ఆహారం, వసతి ఇతర ఖర్చులు) కోసం ప్రస్తుతం 1,00,000 డాలర్లు (సుమారు రూ.86 లక్షలు) అవుతున్నట్టు చెప్పారు. దేశాలను బట్టి ఈ వ్యయాలు మారిపోతాయన్నారు. సింగపూర్‌తో పోల్చి చూసినప్పుడు యూఎస్, కెనడాలో అధిక చార్జీలు ఉన్నట్టు తెలిపారు. పిల్లల వయసు ఏడాది, ఆలోపు ఉన్నప్పుడే పెట్టుబడుల ప్రణాళిక ఆరంభించాలని సూచించారు. 

ప్రైవేటు విద్యా వ్యయాలు పెరిగిపోతున్న తీరు ఆర్థిక సవాళ్లను విసురుతున్నట్టు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ సీవోవో జైదీప్‌ కేవల్‌రమణి పేర్కొన్నారు. ‘‘గత పదేళ్లలో స్కూల్‌ ఫీజులు 150 శాతానికి పైనే పెరగ్గా, కొన్ని యూనివర్సిటీల్లోనూ 200 శాతం మేర ఫీజులు పెరిగాయి. నాణ్యమైన విద్యకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ఫీజులు సూచిస్తున్నాయి’’ అని వివరించారు. పిల్లలు ప్రీ స్కూల్‌ దశకు రాకముందే ప్రణాళిక మొదలు పెట్టాలని సూచించారు. ముందస్తుగా ఆరంభిస్తే కాంపౌండింగ్‌తో పెట్టుబడి మెరుగైన వృద్ధిని చూస్తుంది.  

కాల వ్యవధి.. 
పిల్లల వయసు ప్రస్తుతం ఎంత? పాఠశాల విద్య, ఉన్నత విద్య కోసం ఎంత సమకూర్చుకోవాలన్న విషయాలపై స్పష్టత అవసరం. చిన్నారి వయసు మూడేళ్లు ఉందనుకుందాం. ఇక్కడి నుంచి కాలేజీ చదువులకు ఇంకా 15 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఉన్నత విద్య కోసం కావాల్సినంత సమకూర్చుకునేందుకు 15 ఏళ్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకోవాలి. అదే సమయంలో ఇక్కడి నుంచి ప్లస్‌2 వరకు (ఇంటర్‌) అయ్యే ఖర్చులకూ సన్నద్ధత, ప్రణాళిక వేరుగా ఉండాలి. స్కూల్‌ ఫీజులే కాకుండా, వారికి ఇతర విభాగాల్లో తరీ్ఫదు ఇప్పించాలనుకుంటే అందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 

ఖర్చుకు సన్నద్ధత 
విద్యా ద్రవ్యోల్బణం 11–12 శాతం చొప్పున ఉంటోంది. కనీసం 10 శాతాన్ని అంచనా కింద తీసుకుని చూసినా.. ఐఐటీల్లో బీటెక్‌ కోసం నాలుగేళ్లకు నేడు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుంటే.. 15 ఏళ్ల తర్వాత ఇది రూ.30 లక్షలకు చేరుతుంది. ఇంకాస్త అదనంగా పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటి వరకు మీకున్న పొదుపు పెట్టుబడులను ఒకసారి పరిశీలించండి. అవి కాకుండా, అదనంగా ఎంత సమకూర్చుకోవాలో స్పష్టతకు రావాలి. పిల్లల విద్యకు ఇప్పటి నుంచి ఎన్నేళ్లకు, ఎంత మొత్తం కావాలన్న అంచనాకు వచ్చిన తర్వాత.. ఆ మొత్తం సమకూర్చుకునేందుకు పెట్టుబడుల ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పెట్టుబడులకు కావాల్సినంత మిగులు లేకపోతే.. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలి.

సరైన సాధనాలు.. 
ఇక్కడి నుంచి ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు, పద్దెనిమిదేళ్ల కాలంలో ఎంత మొత్తం కావాలన్న అంచనాకు అనుగుణంగా పెట్టుబడులు మొదలు పెట్టాలి. అంత మొత్తం సమకూర్చునేందుకు వైవిధ్యమైన పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడిపై రాబడి ద్రవ్యోల్బణాన్ని మించేలా చూసుకున్నప్పుడే అసలు లక్ష్యం నెరవేరుతుంది. ఇందుకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మెరుగైనవి. 10 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో ఇవి 12–15 శాతం స్థాయిలో వార్షిక రాబడులను ఇవ్వగలవు.

అదే సమయంలో పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించకూడదు. దీనివల్ల ఆటుపోట్ల రిస్క్‌ పెరుగుతుంది. డెట్‌ సాధనాలకూ నిరీ్ణత శాతాన్ని కేటాయించుకోవాలి. ఈక్విటీ, డెట్‌ కలయికతో కూడిన హైబ్రిడ్‌ ఫండ్స్, మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అసెట్‌ ఫండ్‌ ఈక్విటీ, డెట్‌తోపాటు రియల్‌ ఎస్టేట్, బంగారం, వెండి తదితర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. 

ఈ పథకం గత పదేళ్లలో ఏటా 13 శాతానికి పైనే రాబడిని ఇవ్వడం గమనార్హం. కాల వ్యవధి కనీసం 7–10 ఏళ్లు అంతకుమించి ఉంటేనే ఈక్విటీలకు కేటాయింపులు చేసుకోవాలి. లేదంటే డెట్‌ సాధనాలు అనుకూలం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలు ఉన్న వారు) వంటి పన్ను రహిత సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సూచనల మేరకు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసిన తర్వాతే మిగులు నుంచే ఖర్చులకు వెళ్లాలి. తద్వారా లక్ష్య సాధన తేలిక అవుతుంది.  

రక్షణ కవచాలు
అనుకోని, ఊహించని ఘటనలు చోటు చేసుకుంటే పిల్లల విద్యా లక్ష్యాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించుకోవడం అవసరం. కనుక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి.. 10–20 ఏళ్లపాటు కుటుంబం జీవన అవసరాలు, పిల్లల విద్యా వ్యయాలు, వారి వివాహం ఖర్చులు, రుణాలు ఏవైనా ఉంటే అంత మేర సమ్‌ అష్యూర్డ్‌తో జీవిత బీమా తీసుకోవాలి. ఇందుకు అచ్చమైన టర్మ్‌ ఇన్సూరెన్స్‌తోపాటు.. యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లను పరిశీలించొచ్చు.

సమీక్ష అవసరం.. 
ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్‌ చేయడమే కాకుండా.. అవి అనుకున్న విధంగానే రాబడులను ఇస్తున్నాయా? అన్నది ఏడాదికోసారి నిపుణుల సాయంతో సమీక్షించుకోవాలి. తక్కువ రాబడి ఇస్తుంటే ఇతర సాధనాల్లోకి మారిపోవడం లేదంటే.. పెట్టుబడిని పెంచుకోవడం చేయాలి. అలాగే, అంచనాలకు మించి విద్యా వ్యయాలు పెరుగుతున్నా కూడా పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిందే. కనుక పెరిగే సంపాదనకు అనుగుణంగా ఏటా పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి.  

ప్రత్యామ్నాయాలు.. 
పెట్టుబడులు అనుకు న్న మేర రాబడులను ఇవ్వకపోవచ్చు. లేదంటే అంచనాలకు మించి ఫీజులు పెరిగిపోవచ్చు. మొత్తం మీద నిరీ్ణ త కాలానికి కావాల్సినంత సమకూరకపోతే అప్పుడు ఉన్నత విద్య కోసం విద్యా రుణాలను ఆశ్రయించడం ఒక మార్గం. కోర్సు పూర్తయిన అనంతరం లేదా ఉద్యోగంలో చేరిన అనంతరం చెల్లింపులు మొదలయ్యే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఆదాయపన్ను పాత విధానంలో విద్యా రుణాలపై చేసే వడ్డీ చెల్లింపుల మొత్తానికీ పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది.  

స్కాలర్‌షిప్‌లు 
భారంగా మారిన విద్యా వ్యయా లను గట్టెక్కేందుకు స్కాలర్‌షిప్‌లు కూడా ఒక మార్గం. పేరొందిన సంస్థలు ఏటా నిరీ్ణత సంఖ్యలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఆఫర్‌ చేస్తుంటాయి. వీటిని సాధించేందుకు 
ప్రయత్నించాలి.  

నిపుణుల సాయం 
పిల్లల విద్యా వ్యయాలు, ద్రవ్యోల్బణం ప్రభావం, పెట్టుబడి సాధనాల ఎంపిక అన్నవి చాలా సంక్లిష్టమైనవి. ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడం వల్ల అనవసర ఆందోళన, గందరగోళాన్ని నివారించొచ్చు. అంతేకాదు, మెరుగైన సాధనాల ఎంపిక సాధ్యపడుతుంది. కొంత ఫీజుకు వెనుకాడకుండా వారి సాయాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల ఎంతో ముఖ్యమైన విద్యా లక్ష్యాలను సాఫీగా అధిగమించొచ్చు.

‘నా చిన్నారిని ఖరీదైన ప్రైవేటు స్కూల్‌కు పంపించను’
ఫీజుల పెంపు చేయి దాటిపోతోంది. కొన్ని హైదరాబాదీ స్కూల్స్‌ ఈ ఏడాది 30% వరకు ఫీజులు పెంచేశాయి! 
→ వార్షిక సగటు ఫీజులు ఇప్పుడు రూ. 60,000–2,00,000 మధ్య ఉన్నాయి. 
→ ఏడాది ఫీజు అంతా ముందే చెల్లించాలని కొన్ని స్కూల్స్‌ డిమాండ్‌ చేస్తున్నాయి. 
→ ఒక స్కూల్‌ ఎల్‌కేజీకి రూ.4 లక్షలు చార్జ్‌ చేస్తోంది. 
→ విద్యా ద్రవ్యోల్బణం 12 శాతం చొప్పున పెరుగుతోంది. 

ఈ ధరలతో మనం పిల్లలను స్కూల్‌కు పంపేందుకు సన్నద్ధం చేస్తున్నామా.. లేక తల్లిదండ్రులను దివాలా బాట పట్టిస్తున్నామా?  ప్రైవేటు స్కూల్స్‌ నేడు విద్యా సంస్థల కంటే కూడా స్టార్టప్‌ల మాదిరిగా కనిపిస్తున్నాయి’’ 
– ఫైనాన్షియల్‌ అడ్వైజర్, మాజీ వెల్త్‌ మేనేజర్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) నేహ నగర్‌ లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్ట్‌ ఇది.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement