రిలయన్స్‌ లాభం డీలా | Reliance Q4 results decline in 13percent YoY to Rs 16971 crore in 2026 | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ లాభం డీలా

Apr 25 2026 3:57 AM | Updated on Apr 25 2026 6:08 AM

Reliance Q4 results decline in 13percent YoY to Rs 16971 crore in 2026

క్యూ4లో రూ. 16,971 కోట్లు 

ఆదాయం రూ. 3.03 లక్షల కోట్లు

షేరుకి రూ. 6 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) గతేడాది(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 16,971 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్‌ యూనిట్లు పుంజుకున్నప్పటికీ ప్రపంచ ఇంధన సంక్షోభం కారణంగా చమురు, కెమికల్స్‌(ఓ2సీ) విభాగాలు నీరసించడం ప్రభావం చూపింది. 

అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 19,407 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 2.69 లక్షల కోట్ల నుంచి రూ. 3.03 లక్షల కోట్లకు బలపడింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్‌ఐఎల్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 95,610 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 13 శాతం పుంజుకుని రూ. 2.07 లక్షల కోట్లను అధిగమించింది. 

మొత్తం ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 11.75 లక్షల కోట్లకు చేరింది. వెరసి కంపెనీ చరిత్రలోనే అత్యధిక నికర లాభం, ఇబిటా, ఆదాయం అందుకుంది. క్యూ4లో విభాగాలవారీగా రిలయన్స్‌ రిటైల్‌ లాభం రూ. 3,563 కోట్లుకాగా.. క్యూ4లో 333 కొత్త స్టోర్లను తెరిచింది. అయితే ఓ2సీ బిజినెస్‌ ఇబిటా 4 శాతం క్షీణించి రూ. 14,520 కోట్లకు పరిమితమైంది. కాగా, వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది.

జియో ప్లాట్‌ఫామ్స్‌ గుడ్‌ 
క్యూ4లో లాభం రూ. 7,935 కోట్లు 
ఆర్‌ఐఎల్‌ టెలికం, డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ క్యూ4లో పటిష్ట పనితీరు చూపింది. జనవరి–మార్చిలో నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 7,935 కోట్లను తాకింది. వినియోగదారుల సంఖ్య, ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) తదితర అంశాలు ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 7,022 కోట్లు ఆర్జించింది. 

ఇబిటా 18 శాతం జంప్‌చేసి రూ. 20,060 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 38,259 కోట్లయ్యింది. ఏఆర్‌పీయూ 3.8 శాతం మెరుగై రూ. 214కు చేరింది. కస్టమర్ల సంఖ్య 7 శాతం పెరిగి 52.44 కోట్లయ్యింది. కాగా, 2025–26 పూర్తి ఏడాదికి జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం 15 శాతం ఎగసి రూ. 30,053 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పెరిగి రూ. 1,46,885 కోట్లుగా నమోదైంది.

లిస్టింగ్‌ బాటలో...
జియో ప్లాట్‌ఫామ్స్‌ లిస్టింగ్‌వైపు స్థిరంగా ముందడుగు వేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాం. ఇది కంపెనీ ప్రయాణంలో మైలురాయిగా నిలవనుంది. సరికొత్త ఎత్తులకు చేరడంతోపాటు.. దేశీ డిజిటల్‌ భవిష్యత్‌కు మద్దతిస్తుంది. మరోపక్క రాజకీయ, భౌగోళిక సవాళ్లు, ఇంధన ధరల ఆటుపోట్లు, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల మధ్య ఆర్‌ఐఎల్‌ వృద్ధి పథంలో సాగుతోంది. ఇందుకు డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో, దేశీయంగా పటిష్ట బిజినెస్‌ తోడ్పాటునిస్తున్నాయి. 
– ముకేశ్‌ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 

ఫలితాల నేపథ్యంలో రిలయన్స్‌ షేరు బీఎస్‌ఈలో 1.15 శాతం నష్టంతో రూ.1,328 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement