క్యూ4లో రూ. 1,111 కోట్లు
షేరుకి రూ. 5 తుది డివిడెండ్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా గతేడాది(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 27 శాతం జంప్చేసి రూ. 1,111 కోట్లకు చేరింది. ఇందుకు దేశీ ఆదాయం పుంజుకోవడం సహకరించింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 873 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇతర ఆదాయంతో కలసి మొత్తం ఆదాయం సైతం 23 శాతం ఎగసి రూ. 6,766 కోట్లను అధిగమించింది.
రికార్డ్ డేట్ జూలై 10...
వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు జూలై 10 రికార్డ్ డేట్గా ప్రకటించింది. నెస్కఫే సన్రైజ్, మ్యాగీ నూడుల్స్, కిట్కాట్ తదితర ప్రొడక్టుల దేశీ విక్రయాలు 23 శాతంపైగా బలపడి రూ. 6,445 కోట్లను తాకాయి. ఇవి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. మొత్తం వ్యయాలు 21 శాతం పెరిగి రూ. 5,217 కోట్లను దాటాయి. ప్రకటనల వ్యయాలు 50 శాతం పెరిగినప్పటికీ దేశీ అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ మనీష్ తివారీ పేర్కొన్నారు.
దీంతో నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు పటిష్టస్థాయిలో 26 శాతందాటి నమోదైనట్లు వెల్లడించారు. ఎగుమతుల ఆదాయం మరింత అధికంగా 31 శాతం జంప్చేసి రూ. 249 కోట్లకు చేరింది. కాగా.. పూర్తి ఏడాదికి నెస్లే ఇండియా నికర లాభం 9 శాతం మెరుగుపడి రూ. 3,499 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 14 శాతంపైగా బలపడి రూ. 23,195 కోట్లకు చేరింది.
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 7% జంప్చేసి రూ. 1,379 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,395 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.


