దేశంలోని టెలికాం వినియోగదారులకు మరోసారి మొబైల్ రీఛార్జ్ల భారం పడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో టెలికాం కంపెనీలు టారిఫ్లను సుమారు 10 శాతం మేర పెంచే అవకాశముందని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. గతంలో జరిగినట్లుగా 15–20 శాతం భారీ పెంపులు అవసరం లేదని, ఈసారి పరిమిత స్థాయిలో ధరల సవరణ జరిగే అవకాశం ఉందని ఆయన సీఎన్బీసీ-టీవీ18 వార్తాసంస్థతో పేర్కొన్నారు.
టెలికాం రంగంలో ప్రస్తుతం ఆదాయ వృద్ధి కేవలం టారిఫ్ పెంపులపైనే ఆధారపడడం లేదని మల్హోత్రా వివరించారు. వినియోగదారులు అధిక డేటా ప్రయోజనాలు, 5జీ సేవలు, ప్రీమియం ప్లాన్ల వైపు మారుతుండటంతో కంపెనీలకు ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) సహజంగానే పెరుగుతోందన్నారు. టారిఫ్ పెంపు లేకుండానే ఏఆర్పీయూ ఏటా 4–5 శాతం మేర పెరుగుతోందని ఆయన అంచనా వేశారు.
ఇటీవల సంవత్సరాల్లో జరిగిన టారిఫ్ పెంపులను వినియోగదారులు పెద్దగా వ్యతిరేకించకపోవడం, 5జీ సేవల వినియోగం పెరగడం, అధిక విలువ కలిగిన ప్లాన్లకు మారుతున్న కస్టమర్ల సంఖ్య పెరగడం వంటి అంశాలు టెలికాం కంపెనీల ఆదాయాలకు ఊతమిస్తున్నాయి. దీంతో భారీ ధరల పెంపుల అవసరం ప్రస్తుతం కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, ఇతర బ్రోకరేజ్ సంస్థలు కూడా 2026లో టెలికాం టారిఫ్ల పెంపుపై అంచనాలు వెలువరించాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన సంస్థలు 10–15 శాతం వరకు టారిఫ్లను పెంచవచ్చని జెఫరీస్ వంటి సంస్థలు ఇప్పటికే పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు ఏ టెలికాం సంస్థ అధికారికంగా ధరల పెంపును ప్రకటించలేదు.
టారిఫ్లు నిజంగానే 10 శాతం పెరిగితే ప్రస్తుతం రూ.299 ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధర సుమారు రూ.329కు, రూ.349 ప్లాన్ రూ.384కు చేరే అవకాశం ఉంటుంది. అయితే తుది నిర్ణయం టెలికాం కంపెనీల వ్యూహాలు, మార్కెట్ పరిస్థితులు, పోటీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.


