హుషారుగా మొదలై.. నష్టాల్లోకి | Sakshi
Sakshi News home page

హుషారుగా మొదలై.. నష్టాల్లోకి

Published Mon, Nov 2 2020 9:45 AM

Market in volatile mood- Bank shares in demand - Sakshi

ఆసియా మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తొలుత సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. అయితే ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 132 పాయింట్లు క్షీణించి 39,482కు చేరింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,612 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్‌ 39,880 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 39,407 వరకూ నీరసించింది. ఈ బాటలో నిఫ్టీ 11,697- 11,581 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. సెకండ్‌ వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్‌ దేశాలలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు దేశాలలో మళ్లీ లాక్‌డవున్‌లు విధించడంతో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలను పెంచుతున్నట్లు తెలియజేశారు.

ఫార్మా సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.2 శాతం పుంజుకోగా.. మీడియా, మెటల్‌, ఐటీ, ఫార్మా 1.6-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్‌, యూపీఎల్‌, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐవోసీ, టీసీఎస్‌, ఐషర్‌, విప్రో, బ్రిటానియా, బీపీసీఎల్‌ 4-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ 5 శాతం జంప్‌చేయగా.. ఇండస్‌ఇండ్‌, హీరో మోటో, ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌, సిప్లా, ఎస్‌బీఐ 3-1 శాతం మధ్య ఎగశాయి.

మీడియా వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో జీ, ఐడియా, ఇన్ఫ్రాటెల్‌, పేజ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ 2.6-1.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే శ్రీరామ్‌ ట్రాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌, హావెల్స్‌, బీవోబీ, మారికో 4-1.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 855 నష్టపోగా.. 811 లాభాలతో కదులుతున్నాయి.

Advertisement
Advertisement