చివరి సెషన్‌లో జోరు- రియల్టీ, ఫార్మా అప్‌

Market gains- Realty, Pharma zoom - Sakshi

259 పాయింట్లు అప్‌- 39,303 వద్దకు సెన్సెక్స్‌

83 పాయింట్ల లాభంతో 11,605 వద్ద ముగిసిన నిఫ్టీ‌

రియల్టీ, ఫార్మా, ఆటో అప్‌- మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్‌ వీక్‌

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2-0.5 శాతం ప్లస్‌

స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 259 పాయింట్లు ఎగసి 39,303 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు పుంజుకుని 11,605 వద్ద స్థిరపడింది. అయితే తొలి సెషన్‌లో మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గులను చవిచూశాయి. మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో లాభాలతో నిలిచాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,360- 39,038 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11618- 11517 పాయింట్ల మధ్య ఒడిదొడుకులను చవిచూసింది.

డాక్టర్‌ రెడ్డీస్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, ఆటో రంగాలు 2.3-1.5 శాతం మధ్య ఎగశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ సైతం 0.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. మీడియా 1.6 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్ 4.5 శాతం జంప్‌చేయగా..  ఎంఅండ్‌ఎం, హిందాల్కో, బజాజ్‌ ఆటో, బ్రిటానియా, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, సిప్లా, ఎల్‌అండ్‌టీ 4-1.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇండస్‌ఇండ్‌, ఎన్‌టీపీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఓఎన్‌జీసీ, ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌,  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, ఐటీసీ, గెయిల్‌, యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

డీఎల్‌ఎఫ్‌ ప్లస్
డెరివేటివ్‌ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్‌, రామ్‌కో సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, కేడిలా హెల్త్‌, అదానీ ఎంటర్‌, చోళమండలం, ఎల్‌ఐసీ హౌసింగ్‌, లుపిన్‌, పీఎఫ్‌సీ 5-2 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ కౌంటర్లలో ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, సన్‌టెక్‌, శోభా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 4-1 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా మరోవైపు.. సెయిల్‌, సన్‌ టీవీ, ఎంజీఎల్‌, ఐడియా, ఇండిగో, టాటా పవర్‌, టాటా కెమ్‌, యూబీఎల్‌, ఐజీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, పెట్రోనెట్‌, పీవీఆర్, జిందాల్‌ స్టీల్‌, టొరంట్‌ పవర్‌, ఫెడరల్‌ బ్యాంక్‌  4-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,416 లాభపడగా..1,315 నష్టాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,171 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 896 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top