మూడో రోజూ లాభాల్లోనే- రియల్టీ భళా | Market up 3rd consecutive day- Realty shares zoom | Sakshi
Sakshi News home page

మూడో రోజూ లాభాల్లోనే- రియల్టీ భళా

Oct 20 2020 3:57 PM | Updated on Oct 20 2020 3:58 PM

Market up 3rd consecutive day- Realty shares zoom - Sakshi

విదేశీ ప్రతికూలతల నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 113 పాయింట్లు పుంజుకుని 40,544 వద్ద నిలిచింది. నిఫ్టీ 24 పాయింట్లు బలపడి 11,897 వద్ద స్థిరపడింది. తద్వారా వరుసగా మూడో రోజు లాభాలతో నిలిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,732-40,306 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. నిఫ్టీ 11,949- 11,837 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. గత రెండు రోజుల్లో మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో ఆటుపోట్లు నమోదైనట్లు వివరించారు. 

ఐటీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ 4 శాతం జంప్‌చేయగా.. ఐటీ, మీడియా, ఆటో 2-0.35 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ 1.5-0.2 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, విప్రో, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌, ఇన్ఫోసిస్‌ 4.3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే బ్రిటానియా 6 శాతం పతనంకాగా.. ఓఎన్‌జీసీ, గెయిల్‌, ఐవోసీ, యూపీఎల్‌, పవర్‌గ్రిడ్‌, హిందాల్కో, ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ 2.5-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఐడియా అప్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడియా 10 శాతం దూసుకెళ్లగా.. మైండ్‌ట్రీ, జీ, ఇన్ఫ్రాటెల్‌, పీవీఆర్‌, వేదాంతా, భారత్‌ ఫోర్జ్‌, మదర్‌సన్‌ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క బీవోబీ, పీఎన్‌బీ, హెచ్‌పీసీఎల్‌, బాటా, బంధన్‌ బ్యాంక్‌, కమిన్స్‌ 3.6-1.2 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ కౌంటర్లలో ఒబెరాయ్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా.. బ్రిగేడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, శోభా, డీఎల్‌ఎఫ్‌, సన్‌టెక్‌ 7-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-0.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,373 లాభపడగా.. 1,313 నష్టాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,622 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం  ఎఫ్‌పీఐలు రూ. 480 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు సైతం రూ. 430 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement