పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కలవరపెడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశీయ ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు వీలుగా స్థానికంగాఉన్న అన్ని చమురు, సహజ వాయువు కంపెనీలు తమ నిల్వలు, ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్రం కఠిన ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ)కు ఈ డేటాను క్రమం తప్పకుండా అందించాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనల ద్వారా సమాచార సేకరణకు చట్టపరమైన బలాన్ని చేకూర్చామని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ ఓ సమావేశంలో వెల్లడించారు. ‘గతంలోనూ పీపీఏసీ సమాచారాన్ని సేకరించేది, కానీ తాజా నోటిఫికేషన్తో దీనికి పూర్తిస్థాయి చట్టపరమైన శక్తి లభించింది. ఇప్పుడు ప్రతి సంస్థ కచ్చితంగా సమాచారాన్ని వెల్లడించాల్సిందే. దీనివల్ల పర్యవేక్షణ మరింత పకడ్బందీగా అమలు అవుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.
ఎవరు వివరాలు వెల్లడించాలి?
ప్రభుత్వ తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఈ కింది కార్యకలాపాల్లో నిమగ్నమైన సంస్థలన్నీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.
ముడి చమురు ఉత్పత్తి, రిఫైనింగ్ సంస్థలు.
సహజ వాయువు ప్రాసెసింగ్, రవాణా సంస్థలు.
పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్, పంపిణీదారులు.
దిగుమతిదారులు, టెర్మినల్ ఆపరేటర్లు.
ఈ సంస్థలు తమ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం, కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని రోజువారీ, వారం లేదా నెలవారీ ప్రాతిపదికన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా అందించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండటమే ఈ తాజా ఆదేశాల ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.
‘గోప్యత’ సాకు చెల్లదు
చమురు సంస్థలు తాము కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు లేదా గోప్యతా నిబంధనలను సాకుగా చూపి సమాచారాన్ని దాచడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమాచారం ‘వాణిజ్యపరంగా సున్నితమైనది’ అనే కారణంతో ఏ సంస్థ కూడా నిరాకరించడానికి వీలులేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. గతంలో ఉన్న ఇతర నిబంధనలకు అదనంగా ఈ కొత్త ఆదేశాలు అమలులో ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


