రష్యా నుంచి పెరిగిన చమురు దిగుమతులు  | India ramps up oil imports from Russia, U.S | Sakshi
Sakshi News home page

రష్యా నుంచి పెరిగిన చమురు దిగుమతులు 

Jun 23 2025 6:37 AM | Updated on Jun 23 2025 8:03 AM

India ramps up oil imports from Russia, U.S

జూన్‌లో రోజువారీ 2.2 మిలియన్‌ బ్యారెళ్లు 

సౌదీ, ఇరాక్‌ కంటే అధికం 

అమెరికా నుంచి రెట్టింపు దిగుమతులు  

న్యూఢిల్లీ: రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులను భారత్‌ గణనీయంగా పెంచుకుంది. జూన్‌ నెలలో మధ్యప్రాచ్యం, గల్ఫ్‌ దేశాల కంటే రష్యా నుంచే అధిక చమురు దిగుమతి కావడం గమనార్హం. మొత్తం మీద ఈ నెలలో రోజువారీ 2–2.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ ‘కెప్లెర్‌’ వెల్లడించింది. 

గత రెండేళ్ల కాలంలో రష్యా నుంచి ఈ స్థాయి దిగుమతులు తిరిగి ఈ నెలలోనే అధికమయ్యాయని వివరించింది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌కు మించి రష్యా నుంచి దిగుమతులే అధికంగా ఉన్నట్టు తెలిపింది. మే నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజువారీగా 1.96 మిలియన్‌ బ్యారెల్స్‌గా ఉన్నాయి. మరోవైపు అమెరికా నుంచి ఈ నెలలో రోజువారీ 4,39,000 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, గత నెలలో ఇది 2,80,000 బ్యారెల్స్‌గానే ఉండడం గమనార్హం. మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు ఈ నెల మొత్తంమీద చమురు దిగుమతులు సగటున రోజువారీ 2 మిలియన్‌ బ్యారెళ్లుగా ఉండొచ్చన్నది కెప్లెర్‌ నివేదిక అంచనా.

 చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. రోజువారీ 5.1 మిలియన్‌ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. సంప్రదాయంగా మధ్యప్రాచ్యం, గల్ఫ్‌ దేశాల నుంచే భారత్‌ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతమే ఉండగా, ఆ తర్వాత 40–44 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ రేటుకే చమురును భారత్‌కు రష్యా ఆఫర్‌ చేయడం గమనార్హం.  

సరఫరాపై ప్రభావం పడొచ్చు.. 
ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావం ఇప్పటి వరకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలపై లేదని కెప్లెర్‌ నివేదిక స్పష్టం చేసింది. వెసెల్స్‌ కార్యకలాపాలను గమనిస్తే రానున్న రజుల్లో సరఫరా తగ్గే అవకాశం కనిపిస్తున్నట్టు కెప్లెర్‌ ముఖ్య పరిశోధన విశ్లేషకుడు సుమిత్‌ రితోలియా తెలిపారు. షిప్‌ యజమానులు గల్ఫ్‌ ప్రాంతానికి ఖాళీ ట్యాంకర్లు పంపేందుకు వెనుకాడుతున్నట్టు, దీంతో వెసెల్స్‌ సరఫరా 69 నుంచి 40కు తగ్గినట్టు తెలిపారు. దీంతో సమీప కాలంలో సరఫరాలు కఠినంగా మారొచ్చని.. ఇది భారత దిగుమతుల్లో సర్దుబాట్లకు దారితీయొచ్చని అంచనా వేశారు. హర్ముజ్‌ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్‌ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. 

ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే వస్తోంది. మన దేశ ముడి చమురు దిగుమతుల్లో 40 శాతం, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో సగం సరఫరా ఈ ప్రాంతం నుంచే ఉంటోంది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో హర్ముజ్‌ జలసంధి మూసివేసే రిస్క్‌ ఉందని.. అదే సమయంలో పూర్తిస్థాయి దిగ్బంధనం అవకాశాలు తక్కువే ఉండొచ్చని కెప్లెర్‌ నివేదిక తెలిపింది. ఎందుకంటే ఇరాన్‌కు చైనా అతిపెద్ద కస్టమర్‌గా ఉందని, చైనా సముద్ర మార్గ చమురు దిగుమతుల్లో 47% ఇరాన్‌ నుంచే వస్తుండడాన్ని ప్రస్తావించింది. ఇరాన్‌ 96% చమురు ఎగుమతులు ఈ జలసంధి నుంచే ఉంటున్నందున పూర్తిస్థాయి దగ్బంధనం ఇరాన్‌కే నష్టం కలిగిస్తుందని పేర్కొంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement