క్యూ4లో 8 శాతం అప్
ఆదాయం రూ. 89,809 కోట్లు
రూ. 13 తుది డివిడెండ్
ముంబై: దేశీ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 20,351 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 18,835 కోట్లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 1,16,920 కోట్లుగా నిల్చింది. క్రితం క్యూ4లో ఇది రూ. 1,20,269 కోట్లు. వడ్డీ ఆదాయం రూ. 86,779 కోట్ల నుంచి రూ. 87,182.50 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుపై రూ. 13 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. గతేడాది ఆగస్టు 11న ప్రకటించిన రూ. 2.50 మధ్యంతర డివిడెండుతో కలిపి మొత్తం రూ. 15.5 మేర డివిడెండు ఇచ్చినట్లవుతుందని సంస్థ తెలిపింది.
క్యూ1లో చిన్న రుణగ్రహీతలపై పశ్చిమాసియా ప్రభావం..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల చిన్న, మధ్య తరహా రుణగ్రహీతలపై ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభావం పడొచ్చని బ్యాంక్ సీఈవో, ఎండీ శశి జగదీశన్ తెలిపారు. యుద్ధం ముగిశాక పరిస్థితి చక్కబడటానికి రెండు నెలలు పట్టొచ్చని వివరించారు. అయితే, అసెట్ క్వాలిటీపరంగా ప్రతికూల పరిస్థితులేమీ లేవని చెప్పారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ శాఖ బాండ్ల మిస్–సెల్లింగ్ వ్యవహారం నేపథ్యంలో నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి అకస్మాత్తుగా రాజీనామాపై వ్యాఖ్యానించేందుకు జగదీశన్ నిరాకరించారు. మిస్–సెల్లింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే, విచారణ నివేదిక ఎప్పట్లోగా రావొచ్చనేది కూడా చెప్పడానికి నిరాకరించారు.
దర్యాప్తులో భాగంగా భారీ స్థాయిలో డేటాను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చక్రవర్తి రాజీనామా అనంతరం బ్యాంకు పట్ల సానుకూలంగా వ్యవహరించడంపై ప్రభుత్వం, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాత్కాలికంగా చైర్పర్సన్గా ఉన్న కేకి మిస్త్రీ పూర్తి కాలం కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు కోరుకుంటున్నామని, అయితే నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) ముందు ఈ ప్రతిపాదన ఉంచడానికి ముందుగా నిర్దిష్ట ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. జగదీశన్ పదవీకాలం ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో ఆయన పునర్నియామకం విషయాన్ని ఎన్ఆర్సీ పరిశీలిస్తుందని, ఇందుకు నిర్దిష్ట కాలవ్యవధిని చెప్పలేమని డిప్యుటీ ఎండీ కైజాద్ భరూచా తెలిపారు.
ఇతర విశేషాలు..
→ పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్) రూ. 4,95,463 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 4,70,916 కోట్లు.
→ స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4లో నికర లాభం రూ. 19,221 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో ఇది రూ. 17,616 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 89,488 కోట్ల నుంచి రూ. 89,809 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 62,951 కోట్ల నుంచి రూ. 62,006 కోట్లకు తగ్గాయి.
→ వడ్డీ ఆదాయం రూ. 77,460 కోట్ల నుంచి రూ. 76,610 కోట్లకు నెమ్మదించింది.
→ స్థూల మొండిబాకీల నిష్పత్తి 2025 మార్చి క్వార్టర్లో 1.33 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 1.24 శాతంగా ఉండగా ప్రస్తుతం 1.15 శాతానికి తగ్గింది. నికర మొండిబాకీల నిష్పత్తి 0.38 శాతంగా ఉంది. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 19.7 శాతంగా ఉంది.
→ 2026 మార్చి 31 నాటికి 9,689 శాఖలు, 21,172 ఏటీఎంలు ఉన్నాయి. 2025 మార్చి 31న 9,455 శాఖలు, 21,139 ఏటీఎంలు ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య 2,14,521 నుంచి 2,11,178కి తగ్గింది.


