
దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి, ఎగుమతులు, వ్యాపార భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం కొత్తగా త్రివిధ దళాల వార్షిక ప్రదర్శనను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ఏకీకృత కార్యక్రమం ఇటీవల జరిగిన ప్రత్యేక ఏరోఇండియా(AeroIndia) ప్రదర్శనను భర్తీ చేయనుంది. లాజిస్టిక్ సవాళ్లు, పరిమిత ప్రదేశంలో నిర్వహణ సమస్యలను కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రదర్శన పరిష్కరిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
ఏకీకృత కార్యక్రమం: ఏరోఇండియా పేరుతో ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రత్యేక ఏరోస్పేస్ షో పద్ధతిని తొలగించి త్రివిధ దళాల ఎక్స్పోను నిర్వహించాలని యోచిస్తున్నారు. డిఫెన్స్, ఎయిర్, నేవీ వ్యవస్థలపై ఈ ఎక్స్పోలో దృష్టి సారిస్తారు.
లాజిస్టిక్ సవాళ్లు: ఏటా ఏరోఇండియా ప్రదర్శన బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. అయితే పరిమిత స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు లాజిస్టిక్ సవాళ్లు సమస్యగా మారుతున్నాయి. దీనికోసం మరింత అనువైన వేదికను సిద్ధం చేసి దీనికి పరిష్కారం అందించాలని కొత్త ఎక్స్ పో లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యాపార ధోరణి: త్రివిధ దళాల ఎక్స్ పో ద్వారా వాటాదారులందరూ హాజరై వ్యాపార కార్యక్రమాలపై దృష్టి సారించడం సులభతరం అవుతుంది. ఇది ఎగుమతులను ప్రోత్సహించడానికి, వ్యాపార భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు సహాయపడుతుంది.
ఫ్లాగ్ షిప్ ఈవెంట్: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించి విదేశీ పెట్టుబడిదారులు, వ్యాపారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు?
రక్షణ రంగంపై ప్రభావం
త్రివిధ దళాల ఎక్స్ పో నిర్వహించడం ద్వారా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి, వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక వేదికను సిద్ధం చేసినట్లవుతుంది. ఇది రక్షణ పరిశ్రమపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. రక్షణ రంగంలోని ఉత్పత్తుల తయారీలో దేశ స్వావలంబనకు దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు.