Sakshi News home page

వర్క్‌స్పేస్‌కు డిమాండ్‌

Published Sat, Apr 20 2024 5:48 AM

Global capability centres and 3rd-party IT service providers driving demand for workspace - Sakshi

జీసీసీలు, థర్డ్‌ పార్టీ ఐటీ సర్వీస్‌ సంస్థల దన్ను

గతేడాది లీజింగ్‌లో 46 శాతం వాటా

నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక

న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత్‌కు అవుట్‌సోర్సింగ్‌ చేస్తుండటంతో దేశీయంగా ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ గణనీయంగా పెరిగిందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఒక నివేదికలో తెలిపింది. 2023లో మొత్తం వర్క్‌ స్పేస్‌ లీజింగ్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), థర్డ్‌ పార్టీ ఐటీ సేవల సంస్థల వాటా 46 శాతంగా నమోదైందని వివరించింది. ‘ఆసియా పసిఫిక్‌ హొరైజన్‌: హార్నెసింగ్‌ ది పొటెన్షియల్‌ ఆఫ్‌ ఆఫ్‌షోరింగ్‌‘ రిపోర్టు ప్రకారం భారత్‌లో ఆఫ్‌షోరింగ్‌ పరిశ్రమ గణనీయంగా పెరిగింది.

గ్లోబల్‌ ఆఫ్‌షోరింగ్‌ మార్కెట్లో 57 శాతం వాటాను దక్కించుకుంది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిర్వహణ సామరŠాధ్యలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను లేదా సర్వీసులను ఇతర దేశాల్లోని సంస్థలకు అవుట్‌సోర్స్‌ చేయడాన్ని ఆఫ్‌షోరింగ్‌గా వ్యవహరిస్తారు. దీన్నే బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (బీపీవో)గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో జీసీసీలు, గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసులు (జీబీఎస్‌) మొదలైనవి ఉంటాయి. కంపెనీలు వేరే ప్రాంతాల్లో అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే యూనిట్లను జీసీసీలుగా వ్యవహరిస్తారు.

నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..
► 2023లో ఆఫ్‌షోరింగ్‌ పరిశ్రమలో మొత్తం లీజింగ్‌ పరిమాణం 27.3 మిలియన్‌ చ.అ.గా నమోదైంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 26 శాతం పెరిగింది. జీసీసీలు 20.8 మిలియన్‌ చ.అ., థర్డ్‌ పార్టీ ఐటీ సేవల సంస్థలు 6.5 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకి తీసుకున్నాయి.  
► భారత ఎకానమీకి ఆఫ్‌షోరింగ్‌ పరిశ్రమ గణనీయంగా తోడ్పడుతోంది. 2023లో మొత్తం సేవల ఎగుమతుల్లో దీని వాటా దాదాపు 60 శాతంగా నమోదైంది. సర్వీస్‌ ఎగుమతులు 2013లో 63 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2023లో మూడు రెట్లు వృద్ధి చెంది 185.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఆఫ్‌షోరింగ్‌ సేవలు అందించే గ్లోబల్‌ సంస్థల్లో 42 శాతం కంపెనీలకు భారత్‌లో కార్యకలాపాలు ఉన్నాయి.  
► 2023 నాటికి దేశీయంగా జీసీసీల సంఖ్య 1,580 పైచిలుకు ఉంది. దేశీ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ లావాదేవీల్లో వీటి వాటా 2022లో 25 శాతంగా ఉండగా 2023లో 35 శాతానికి చేరింది. జీసీసీల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థల వాటా గణనీయంగానే ఉన్నప్పటికీ తాజాగా ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో వృద్ధికి సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఫార్మా తదితర రంగాలు కారణంగా ఉంటున్నాయి.
► రాబోయే దశాబ్ద కాలంలో ఆఫీస్‌ మార్కెట్‌కు జీసీసీలే చోదకాలుగానే ఉండనున్నాయి. 2030 నాటికి దేశీయంగా వీటి సంఖ్య 2,400కి
చేరనుంది. 

Advertisement
Advertisement