82 శాతం మంది ఫోన్లు డ్యామేజ్..
ఇన్సూరెన్స్ తీసుకుంటున్నది 15 మందిలో ఒక్కరే!
భారతీయుల నిత్య జీవితంలో స్మార్ట్ఫోన్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వాటి రక్షణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది. ఇన్సూర్టెక్ ప్లాట్ఫామ్ వన్అసిస్ట్, హన్సా రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన ‘ది గ్రేట్ ఇండియన్ స్మార్ట్ఫోన్ ప్రొటెక్షన్ క్రైసిస్’ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు
దేశంలో 82 శాతం మంది కనీసం ఒక్కసారైనా ఫోన్ను కింద పడేయగా, 72% మంది తీవ్రమైన డ్యామేజ్ను ఎదుర్కొన్నారు.
ప్రమాదాలు పెరిగినా కేవలం 6-8 శాతం మంది (ప్రతి 15 మందిలో ఒక్కరు) మాత్రమే యాక్టివ్ ప్రొటెక్షన్ ప్లాన్లు కలిగి ఉన్నారు.
ఫోన్ కింద పడగానే 35% మంది తీవ్ర ఆందోళనకు గురవుతుండగా మహిళల్లో ఈ భయం (43%) ఎక్కువగా ఉంది. పిల్లలు, పెంపుడు జంతువుల వల్ల మహిళల ఫోన్లు పాడయ్యే అవకాశాలు పురుషుల కంటే 3 రెట్లు ఎక్కువ.
ఫోన్ నీటిలో పడితే 29% మంది బియ్యంలో పెట్టడం, స్క్రీన్ పగిలితే 20–32% మంది టేప్తో సర్దుకుపోవడం వంటి తాత్కాలిక చర్యలకే మొగ్గు చూపుతున్నారు.
మెట్రోయేతర నగరాల్లో 54% మంది సెకండ్ హ్యాండ్ ఫోన్లు వాడుతున్నారు. వీటిలో 70% మంది ఇన్సూరెన్స్ అవసరమని భావిస్తున్నారు.
ఫోన్ల ధరలు పెరగడం, క్లెయిమ్ ప్రాసెస్పై నమ్మకం లేకపోవడమే ప్రొటెక్షన్ ప్లాన్లు తీసుకోకపోవడానికి ప్రధాన కారణాలని సర్వే తెలిపింది. జేబులు, బ్యాగుల నుంచి జారడం వల్లే 36% ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది.
‘ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఏ పనీ నడవట్లేదు. అది పాడైపోతుందేమోనని అందరికీ భయమున్నా దానికి ఇన్సూరెన్స్ లేదా ప్రొటెక్షన్ తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ రెండింటికీ పొంతన కుదరడం లేదు. అందుకే వినియోగదారులకు నమ్మకం కలిగేలా, క్లెయిమ్ ప్రాసెస్ను చాలా తేలికగా, స్పష్టంగా మార్చాల్సిన బాధ్యత ఈ కంపెనీలపైనే ఉంది’ అని వన్అసిస్ట్ కో-ఫౌండర్ సుబ్రత్ పానీ తెలిపారు.
ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర..


