చివర్లో తేరుకున్న మార్కెట్.. అయినా తప్పని నష్టాలు
ముంబై: ఈ రోజు భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్ చివర్లో కోలుకుంది. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు, పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా మొదలయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణి కనబరచడంతో ఉదయం ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్ మరో గంటలో ముగుస్తుందనగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక్కసారిగా మార్కెట్ పుంజుకుంది. ఫలితంగా భారీ నష్టాల నుంచి తప్పించుకున్న రెండు సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదారు ఆరు వందల పాయింట్ల నష్టంతో 56,429 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత మరింత నష్టాలను చవి చూస్తూ ఓ దశంలో 56,412 పాయింట్లకు పడిపోయింది. అయితే మరో గంటలో మార్కెట్ ముగుస్తుందనగా ఒక్కసారిగా పుంజుకుంది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 85 పాయింట్ల నష్టంతో 56,975 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 33 పాయింట్లు నష్టపోయి 17,069 పాయింట్ల దగ్గర ముగిసింది. కోల్పోయిన 17 వేల పాయింట్లను నిఫ్టీ తిరిగి సాధించగా సెన్సెక్స్ 57 వేల పాయింట్లు క్రాస్ చేసేందుకు కొద్ది దూరంలో ఆగిపోయింది.
చదవండి: వృద్ధులకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయ మార్గాలివే!