
భారత్లో వచ్చే ఐదేళ్లలో సివిలియన్ హెలికాప్టర్ల సంఖ్య రెట్టింపు అవుతుందని ఎయిర్బస్ హెలికాప్టర్స్ అంచనా వేసింది. మెడికల్ ఎమర్జెన్సీలు, డిజాస్టర్ రిలీఫ్, లా ఎన్ఫోర్స్మెంట్, టూరిజం రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఇందుకు కారణమని తెలిపింది. ఇది కీలకమైన సేవల కోసం హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని సూచిస్తుంది.
ప్రస్తుత పరిస్థితులు ఇలా..
దేశంలో ప్రస్తుతం 250 సివిల్ హెలికాప్టర్లున్నాయి. ఇది ప్రపంచ సివిలియన్ ఫ్లీట్లో సుమారు ఒకశాతంగా ఉంది. ఈ వాటా ప్రస్తుతానికి స్వల్పంగానే ఉన్నప్పటికీ దేశంలోని వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎయిర్బస్ హెలికాప్టర్లకు అపారమైన మార్కెట్ ఉంటుందని అంచనా వేస్తుంది. కొండ రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అమెరికాతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధం
భారత ప్రభుత్వం కూడా ఈ సర్వీసులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రాంతీయ హెలికాప్టర్ సేవలతో సహా సరసమైన విమాన కనెక్టివిటీని అందించేందుకు ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రాజెక్టు సంజీవని ద్వారా మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా హెలిపోర్టులను ఏర్పాటు చేసేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఎయిమ్స్ రిషికేశ్లో హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీసులకు ఆదరణ పెరిగింది. ఇక్కడ ఎయిర్బస్ హెచ్ 125 హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలకోసం సిబ్బందిని, రోగులను తరలిస్తున్నారు.