2030 నాటికి అంచనా
ఎన్ఎల్బీ సర్వీసెస్ నివేదిక
ముంబై: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమలో ఉద్యోగాలు కూడా భారీగా పెరగనున్నాయి. దీంతో సిబ్బంది సంఖ్య 2026 నాటికి 11 శాతం వృద్ధి చెంది 24 లక్షలకు, ఆ తర్వాత 2030 నాటికి 34.6 లక్షలకు చేరనుంది. ప్రస్తుత స్థాయితో పోలిస్తే అప్పటికి 13 లక్షల కొలువులు కొత్తగా జతకానున్నాయని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎన్ఎల్బీ సర్విసెస్ ఒక నివేదికలో తెలిపింది. ‘జీసీసీ 4.0 ప్రస్థానంలో భారత్ కీలక దశలో ఉంది.
నేడు జీసీసీలు కేవలం కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించుకోవడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. దాన్ని వినియోగంలోకి తెచ్చే దిశగా ముందుకు వెళ్తున్నాయి. సాధారణంగా ఈ పరిశ్రమలో ఏఐ జోరు ఊహించినదే అయినప్పటికీ ఈ సంవత్సరం ఇది కాస్త వేగవంతమైంది‘ అని సంస్థ సీఈవో సచిన్ అలగ్ తెలిపారు. దీనితో నిపుణుల నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశీయంగా ఆరు నగరాల్లో 10 రంగాల నుంచి 321 జీసీసీ దిగ్గజాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎన్ఎల్బీ సర్వీసెస్ ఈ నివేదిక రూపొందించింది. 2025 జూలై–అక్టోబర్ మధ్య ఈ సర్వే నిర్వహించారు. రిపోర్ట్లో మరిన్ని విశేషాలు..
⇒ ఏఐ వినియోగం పెరిగే కొద్దీ జీసీసీల్లో కొత్త రకం కొలువులు వస్తున్నాయి. సైబర్సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్స్ (29 శాతం), ప్రాంప్ట్ ఇంజినీర్స్ (26 శాతం), జెన్ఏఐ ప్రోడక్ట్ ఓనర్స్ (22 శాతం), ఏఐ పాలసీ అండ్ రిస్క్ స్ట్రాటెజిస్ట్స్ (21 శాతం)కి డిమాండ్ నెలకొంది.
⇒ అదే సమయంలో ఎల్1 ఐటీ సపోర్ట్ (75 శాతం), లెగసీ అప్లికేషన్ డెవలప్మెంట్ (74 శాతం), మాన్యువల్ క్యూఏ (72 శాతం), ఆన్–ప్రెమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ (67 శాతం) విభాగాల్లో ఉద్యోగాలను జీసీసీలు దశలవారీగా తొలగిస్తుండటం గమనార్హం.
⇒ భౌగోళికంగా జీసీసీలు మెట్రో నగరాల నుంచి క్రమంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు మళ్లుతున్నాయి. చిన్న పట్టణాల్లో అట్రిషన్ (ఉద్యోగుల వలస) రేటు తక్కువగా 10–12 శాతం స్థాయిలో ఉండటం, ఆఫీస్ వ్యయాలు 30–50 శాతం తక్కువగా ఉండటం, ఉద్యోగులపై వ్యయాలు 20–35 శాతం మేర తక్కువగా ఉండటం వంటి అంశాలు
ఇందుకు కారణం.
⇒ 2030 నాటికి జీసీసీల్లో 39 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి పని చేసే అవకాశం ఉంది. మరోపక్క ప్రథమ శ్రేణి నగరాలు లీడర్íÙప్, గవర్నెన్స్, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రాలుగా కొనసాగనున్నప్పటికీ, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్ లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి హబ్లు చాలా వేగంగా స్పెషలైజ్డ్ డెలివరీ సెంటర్లుగా ఎదుగుతున్నాయి.


