కల్తీ జరగకుండా తనిఖీలు చేయండి
టాస్క్ఫోర్స్ సమావేశంలో
కలెక్టర్ అంకిత్
ఎరువులు,
విత్తనాల
సూపర్బజార్(కొత్తగూడెం): వచ్చే వ్యవసాయ సీజన్లో ఎక్కడ కూడా కల్తీ విత్తనాలు, ఎరువులు మార్కెట్లోకి రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఇదేవిషయమై రైతు వారోత్సవాల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం కలెక్టరేట్లో బుధవారం జరగగా కలెక్టర్తో పాటు ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, సంబంధిత శాఖల అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, 1.75 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నందున విత్తనాల పంపిణీ, ఎరువుల నిల్వలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఇదే సమయాన డీలర్లు కూడా రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు అమ్మడం వంటివి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తూ రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ.. డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి కొరత రాకుండా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి రైతులు రానున్నందున నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించాలని తెలిపారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
చండ్రుగొండ: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. చండ్రుగొండలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన అందుతున్న వైద్యసేవలు, రక్త పరీక్షలు, మందుల నిల్వలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసరమైన మందులు నిల్వ ఉంచుకోవడమేకాక వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తహసీల్దార్ జగదీశ్వర్ప్రసాద్, డాక్టర్ రాము, సిబ్బంది పాల్గొన్నారు.


