బాపట్ల జిల్లా డిప్యూటీ కలెక్టర్ లవన్న
కారంచేడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహించనున్న జలధార–జలసంరక్షణ పథకంపై ప్రజలు సరైన అవగాహన కలిగి ఉండేలా సంబంధిత అధికారులు, పాలకులు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా డిప్యూటీ కలెక్టర్ లవన్న అన్నారు. శుక్రవారం ఆయన కారంచేడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామసభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో ప్రధాన సాగు, తాగునీటి వనరులుగా ఉన్న కొమ్మమూరు, సాగర్ ఆయకట్టు కింద ఉన్న భూములకు అవసరమైన సాగునీటితోపాటు, ఆయా గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేలా తాగునీటిని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. నీటిని వృథా చేసుకోవడం వలన భవిష్యత్లో నీటి గండం ఏర్పడే ప్రమాదం ఉంటుందన్నారు. నీటి సంరక్షణ, నీటి భద్రత, తాగునీటి చెరువుల పునరుద్ధరణలు వంటి అనేక విషయాలపై ఆయన 100 రోజుల కార్యాచరణలో భాగంగా సాగునీటి సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వర్షపు నీటని కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకొనేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కే నేతాజీ, తహసీల్దారు జీ నాగరాజు, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, నీటి సంఘాల నాయకులు పాల్గొన్నారు.


