ఏపీ ఆయిల్ ఇండస్ట్రీస్ స్టేట్ లెవెల్ జనరల్ మేనేజర్ ఎన్.భాస్కర్రెడ్డి
తాడేపల్లిరూరల్: రాష్ట్రంలో ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ సరఫరాలు స్థిరంగా ఉన్నాయని ఏపీ ఆయిల్ ఇండస్ట్రీ స్టేట్ లెవెల్ జనరల్ మేనేజర్ ఎన్.భాస్కరరెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పట్టణ పరిధిలోని రిటైల్ రీజనల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థలు సమన్వయంతో సరఫరాలను సజావుగా కొనసాగిస్తున్నాయని తెలిపారు. గృహ వినియోగ సిలిండర్ల సరఫరా 100 శాతం జరుగుతోందని తెలిపారు. హాస్పిటల్స్, స్కూల్స్, రైల్వే క్యాంటీన్స్, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, నూరుశాతం సరఫరా అందిస్తుమని రెస్టారెంట్లు, వ్యవసాయం ఇతర రంగాలకు 70శాతం కంటే ఎక్కువ సరఫరా కొనసాగుతోందని పేర్కొన్నారు. రోజుకు సుమారు 2.3 లక్షల నుంచి 2.4 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని ఓటీపీ ఆధారిత డెలివరీ విధానం ద్వారా 90 శాతం వరకు పారదర్శకత సాధించారని అన్నారు. బ్లాక్ మార్కెటింగ్ నివారణ కోసం(1079) దాడులు నిర్వహించి, 4300 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గ్యాస్ దొరకదని భయంతో బుకింగ్ చేయవద్దని సరఫరాల విషయంలో ఎలాంటి కొరత లేదని సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హెచ్పిసిఎల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉపేంద్ర, చీప్ రీజినల్ మేనేజర్ హెచ్పిసిఎల్ అభిషేక్ ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్
గుంటూరు లీగల్: బాల్య వివాహాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు మంగళవారం నిర్వహించారు.
వంద రోజుల అవగాహన సదస్సులో భాగంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ గుంటూరు అండ్ మెప్మా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అన్నారు. గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆశ (అవేర్నెస్, సపోర్ట్ అండ్యాక్షన్) సోప్– 2025 అనే కొత్త కార్యాచరణను రూపొందించిందని వివరించారు. జిల్లా స్థాయిలో యూనిట్ ఏర్పాటు చేసి ఈ యూనిట్ ద్వారా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, పోలీసులు, న్యాయ సేవాధికార సంస్థలు సమష్టిగా పని చేస్తాయని చెప్పారు. సీడబ్ల్యూసీ, జేజేబీ సంస్థలు పిల్లలకు అవసరమైన అన్ని చట్టపరమైన సేవలు ఉచితంగా అందుతాయని అలాగే పిల్లల హక్కుల రక్షణ కోసం చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో న్యాయం జరిగేలా చూడటం మన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సి. హెచ్. విజయ్ కుమార్ పాల్గొన్నారు.


