భట్టిప్రోలు: వేమూరు నియోజకవర్గ పరిధిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా నిర్వహించనున్న మహాసభ ఏర్పాట్లను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. భట్టిప్రోలు–సూరేపల్లి రహదారి మార్గంలో వేమవరం వద్ద 216ఎ జాతీయ రహదారి పక్కన నిర్మితమవుతున్న సభావేదిక, ప్రజలు కూర్చునే ఏర్పాట్లు, పార్కింగ్, తాగునీటి సదుపాయం, రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ కౌంటర్లు, మీడియా గ్యాలరీ, పార్టీ క్యాడర్ వంటి అంశాలపై ఎమ్మెల్యే అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఆనందబాబు మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రైతులకు పాస్ పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. అమృతలూరు, చెరుకుపల్లి, ఐలవరం, చుండూరు, వేమూరు, కొల్లూరు ప్రాంతాల నుంచి వచ్చేవారికి పార్కింగ్ ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అధికారులు ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే వెంట రెవెన్యూ, పోలీస్, రోడ్లు, భవనాలు, వ్యవసాయ శాఖల అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో ఈనెల 9న సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనే బహిరంగ సభ నేపధ్యంలో ఏర్పాట్లను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సోమవారం రాత్రి సమీక్షించారు. హెలిప్యాడ్ నిర్మాణాన్ని పరిశీలించి, పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సభా వేదిక వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని, అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చంద్రబాబు రాకతో యంత్రాంగం అప్రమత్తం
భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన
ఎస్పీ ఉమామహేశ్వర్..
భట్టిప్రోలు: సీఎం జిల్లా పర్యటన పురస్కరించుకుని అడ్వాన్డ్స్ సెక్యూరిటీ లైజన్ క్లోజ్ను మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గురువారం నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామానికి విచ్చేయనున్నారు. ఈసందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్లను ఏఎస్జీ, ఇతర విభాగాల అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. హెలికాప్టర్ దిగేందుకు నిర్ణయించిన ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. హెలిపాడ్ ప్రాంతానికి వచ్చే వాహనాల పార్కింగ్, పార్టీ కేడర్ సమావేశం జరుగు ప్రదేశం, ప్రజావేదిక, పార్కింగ్, వీఐపీ, వీవీఐపీ వాహనాల పార్కింగ్ ప్రదేశాలను, సీఎం కాన్వాయి వెళ్లే మార్గాలు క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు పోలీసు అధికారులు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ పి.నారాయణ, ఏఎస్జీ, అధికారులు, పోలీసు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
– అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే ఆనందబాబు