
‘వెన్నుపోటు’ పుస్తకావిష్కరణ
చీరాల అర్బన్: రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో కూటమి పాలన గురించి ప్రచురించిన ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. పాలనపై, ఇచ్చిన హామీలపై ఎవరు మాట్లాడినా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి అరాచకాలు, మహిళలు, యువతులు, చిన్నారులపై అకృత్యాలు పెరిగాయన్నారు. కూటమి వైఫల్యాలపై ప్రశ్నిస్తే కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత పాలనకు ప్రజలు తేడా గమనిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు హామీలు గుప్పించి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సుపరిపాలన అందిస్తున్నామంటూ ప్రగల్భాలు చెప్పుకోవడం దారుణమన్నారు. పార్టీ నాయకులు కావూరి రమణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు వాసిమళ్ల వాసు, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బత్తుల అనిల్, మచ్చా సువార్త, వేటపాలెం మండల అధ్యక్షులు సాధు రాఘవ, వేటపాలెం మైనార్టీ అధ్యక్షులు ఖాదర్, డి.మార్క్, తేళ్ల రాంబాబు, రామచంద్ర, జాన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.