
క్వారీ గుంతలో పడి యువకుడు మృతి
గుంటూరు రూరల్: క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి చెందిన కట్టెపోగు నాగరాజు (30) ఆటోడ్రైవర్. అతనికి భార్య రూపకోటేశ్వరి, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. మరో రెండు రోజుల్లో కోటేశ్వరి ప్రసవించనుందని వైద్యులు తెలిపారు. దీంతో నాగరాజు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బయటకు వెళుతున్నానని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవటంతో స్థానికులు అంతటా వెతికారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లక్వారీ గుంత వద్ద నాగరాజు చెప్పులు, పక్కనే అతని ద్విచక్ర వాహనం కనిపించాయి. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత మేడికొండూరు, నల్లపాడు పోలీసుల మధ్య సరిహద్దు వివాదం నడిచిన అనంతరం నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల కోసం సోమవారం వేచి చూశారు. రాత్రి కావటంతో మంగళవారం ఉదయం నుంచి వెతుకులాట ప్రారంభించగా, నాగరాజు మృతదేహం లభ్యమైంది. పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారి పడ్డాడా? ఇక్కడ ఎక్కువగా ఉన్న కోతులు దాడి చేస్తే తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మృత్యుపాశాలుగా క్వారీ గుంతలు
అనుమతులు లేకున్నా అక్రమంగా మైనింగ్ క్వారీలను నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. ఎక్కువ లోతులో క్వారీలను తవ్వి వదిలేస్తున్నారు. ఈ గుంతల్లో నీరు నిలిచిపోతోంది. విషయం తెలియని కొందరు వ్యక్తులు ఇటువంటి ప్రమాదాలతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మైనింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.