
చేనేతలకు మంచిరోజులొచ్చాయ్
● జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ● కలెక్టర్ను సన్మానించిన చేనేత సంఘాల నాయకులు
బాపట్ల: కుప్పడం పట్టు చీరలకు జాతీయస్థాయి గుర్తింపు లభించడంతో చేనేతలకు మంచి రోజులు వచ్చాయని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. కుప్పడం పట్టు చీరలకు జాతీయస్థాయి గుర్తింపు లభించడంపై చేనేత సహకార సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా నివేదించడంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్మికుల కలలు నెరవేరాయన్నారు. చీరాల కుప్పడం పట్టు చీరలకు గుర్తింపు లభించడం ద్వారా వాటికి మంచి డిమాండ్ పెరుగుతుందని కలెక్టర్ చెప్పారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చేనేత కార్మికుల కలలు నెరవేరుతాయన్నారు. చేనేత వృత్తికి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. తద్వారా చేనేతల సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. చేనేత కార్మికులందరికీ మంచి జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్గౌడ్, జిల్లా చేనేత చేనేత జౌళి సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె నాగమల్లేశ్వరరావు, చేనేత సహకార సంఘాల నాయకులు దివి రాంబాబు, జీవీ నాగేశ్వరరావు, కె.వి నాంచారయ్య, శ్రీనివాసరావు, పి వెంకట సుబ్బారావు, పి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
బంగారు కుటుంబాల ఆర్ధిక అభివృద్ధికి కృషి
బాపట్ల: పి–4 బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. పి–4 కింద డీఆర్డీఏ దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలకు చేయూతనందించే కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. బంగారు కుటుంబాల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకున్న డీఆర్డీఏ 13 కుటుంబాలను దత్తత తీసుకుంది. వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడం కోసం రూ.10.95 లక్షలను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు. చెక్కు రూపంలో నగదును బంగారు కుటుంబాలకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఒకరికి బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, ముగ్గురికి వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. బాపట్ల జిల్లాలో బంగారు కుటుంబాలు 62వేలు ఉన్నాయన్నారు. వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, వెలుగు అధికారులు కె రవికుమార్, జి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.