
రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి
యువతికి తీవ్ర గాయాలు
తెనాలి రూరల్: రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి చెందగా, యువతి తీవ్ర గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన వైద్యుడు బూదాటి వెంకటేష్(35) తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని డయాలసిస్ విభాగంలో పని చేస్తున్నాడు. విజయవాడకు చెందిన స్నేహితురాలు యామినీని తెనాలి నుంచి విజయవాడకు తీసుకెళ్లేందుకు బుల్లెట్పై బయలుదేరారు. వీఎస్సార్ కళాశాల దాటగానే తెనాలి–విజయవాడ రహదారిపై ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ట్రెయిలర్ ఢీకొని ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు ఇద్దరిని తరలించగా, వెంకటేష్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అపస్మారస్థితిలో ఉన్న యామినికి చికిత్స అందిస్తున్నారు. రూరల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.