
నెలకు రెండుసార్లు రుణమేళా నిర్వహిస్తాం
కలెక్టర్ అరుణ్ బాబు
నరసరావుపేట: జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా రుణమేళా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, రుణ దరఖాస్తుదార్లతో మెగా రుణమేళా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ఒకసారి, నియోజకవర్గస్థాయిలో ఒకసారి రుణమేళా నిర్వహించి బ్యాంకు రుణాలు సులభంగా పొందడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. బ్యాంకులకు అందిన రుణ దరఖాస్తులను అక్కడికక్కడే పరిశీలించి రుణవితరణ చేపడతామన్నారు. మొత్తం 338 దరఖాస్తులను పరిశీలించి 50 మంది చిరువ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.50 లక్షలు స్వయం సిద్ధ రుణాలు మంజూరు చేశారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద మరో రూ.32 లక్షలు మంజూరు చేశారు. ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రుణాలకోసం బ్యాంకులను మాత్రమే ఆశ్రయించటం శ్రేయస్కకరమని అన్నారు. రుణాలు అందించేందుకే బ్యాంకులు ఉన్నాయని, ప్రభుత్వ పథకాల ద్వారా అందజేసే రుణాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎల్డీఎం రాంప్రసాద్, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, యూనియన్ బ్యాంకు అధిపతి మాధురి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ అధికారి సుభాష్ పాల్గొన్నారు.