
వైభవంగా పునీత ఆంథోని పుణ్యక్షేత్ర వార్షికోత్సవం
నెహ్రూనగర్: నగరంపాలెంలోని పునీత ఆంథోని పుణ్యక్షేత్ర 35వ వార్షికోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా గుంటూరు మేత్రాసన పీఠాధిపతి బిషప్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యయ్య, నెల్లూరు పీఠాధిపతి బిషప్ రెవరెండ్ పిల్లి ఆంథోని దాస్, గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతి బిషప్ రెవరెండ్ డాక్టర్ గాలి బాలి హాజరయ్యారు. ముందుగా పుణ్యక్షేత్ర ఆవరణ నుంచి గుర్రపు బగ్గీపై ఇద్దరు పీఠాధిపతులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆనంతరం దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యయ్య మాట్లాడుతూ పునీత ఆంథోని పుణ్యక్షేత్ర వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి కథోలిక విశ్వాసులు తరలివచ్చి పునీత ఆంథోని అద్భుతాలు పొందుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుణ్యక్షేత్ర విచారణ గురువు కొచ్చెర్ల జ్యోతిరాజు, సహాయ గురువు ఎన్. రాజేష్, ఫాదర్లు దాసరి కిరణ్, పి. బాలస్వామి, రేపూడి రాయప్ప, రాజారెడ్డి, సుందరరావు, బాలస్వామి, కమిటీ సభ్యులు ఎన్.జె. ప్రకాశరావు, జొన్నలగడ్డ సుధీర్బాబు, వై. సుదర్శన్, దేవస్వామి, శాంతయ్య పాల్గొన్నారు.