
బీసీల హక్కుల సాధనకు అలుపెరగని పోరు
తెనాలి: బలహీనవర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు, కులగణన కోసం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రజాక్షేత్రంలో చేస్తున్న పోరాటాలు అభినందనీయమని, ఆయనకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచారశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కులగణనకు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ అందుకోసం సుదీర్ఘకాలంగా రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించిన కేసన శంకరరావు అభినందన సభను ఆదివారం తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఆహ్వాన కమిటీ తరపున జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ బలహీన వర్గాల నుంచి వచ్చిన ఐఏఎస్ఎ, ఐపీఎస్, రాజకీయనేతలు తమ మూలాలను మరిచిపోతున్నారనీ, వారు కూడా వ్యవస్థలోనే కలిసిపోతున్నారని అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు రిజర్వేషన్లతో ఎలా ఎదుగుతారనేది సందేహమేనన్నారు. సంక్షేమం, రిజర్వేషన్లు కొంతమేరకు తోడ్పడతాయని చెబుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు పూర్తిగా తొలగిపోతాయని భావించలేమని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బీసీ నాయకత్వానికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. బీసీలకు సంక్షేమం, పదవుల విషయంలో చిత్తశుద్ధితో కృషిచేస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార, ప్రజాసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జనాభాలో 75 శాతంగా ఉన్న దళితులు, బీసీలు పారిశ్రామిక, వ్యాపార, ఉన్నతస్థాయిలోకి రాలేకపోవడంపై చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీలను సంఘటితపరుస్తూ వారి సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు జీవితాన్ని అంకితం చేసిన కేసన శంకరరావుకు తగిన గుర్తింపు లభించాల్సి ఉందని, అందుకు తామంతా తోడ్పడతామని హామీనిచ్చారు. వేదాంతం ఫణీంద్ర స్వాగతం పలికిన సభలో తొలుత శంకరరావుపై తీసుకొచ్చిన అభినంద సంచికను మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం శంకరరావును ఘనంగా సత్కరించారు. అఖిల భారత ఓబీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, చిల్లపల్లి శ్రీనివాసరావు, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, విన్నకోట వెంకటేశ్వర్లు, గోనుగుంట్ల బ్రహ్మానందశర్మతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్నుంచి హాజరైన బీసీ సంక్షేమ ంఘం, బీసీ సంఘాల నేతలు, అనుమోలు ఏడుకొండలు, శివరాం బాలాజీ, కోలా అశోక్, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమాన్ని ఆహ్వాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
అభినందన సభలో కేంద్ర మంత్రి
పెమ్మసాని, రాష్ట్ర మంత్రులు మనోహర్, పార్థసారథి, సత్యకుమార్యాదవ్
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం
అధ్యక్షుడు కేసన శంకరరావు కృషికి
సహకారం అందిస్తాం