
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో ఉదయం 10గంటల నుంచే అంతరాలయ దర్శనం నిలిపివేయాలని ఆలయ ఈవో శీనానాయక్ సిబ్బందిని ఆదేశించారు. అంతరాలయ దర్శనం నిలిపివేయడంతో భక్తులు రూ.300 టికెట్లు కొనుగోలు చేసి బంగారు వాకిలి దర్శనం చేసుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో రూ.300తోపాటు రూ.100 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు మూడు క్యూలైన్ల ద్వారా త్వరతిగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈవో తనిఖీలు
భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్, ఈఈ కోటేశ్వరరావు ఘాట్రోడ్డులోని చెప్పుల స్టాండ్, క్లోక్రూమ్, దేవస్థాన బస్సులను తనిఖీ చేశారు. చెప్పుల స్టాండ్, సెల్ఫోన్ కౌంటర్ వద్ద భక్తులు గుంపులు గుంపులుగా నిల్చోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని నియమించి క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. ఘాట్రోడ్డులో దేవస్థానం ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్స్కు తాళాలు వేసి ఉండటంతో ఈవో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ టోల్గేట్ వద్దకు చేరుకుని కొండపైకి వచ్చే వాహనాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ ఉచిత ప్రసాదాలతోపాటు అన్న ప్రసాదం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం రద్దీ కొనసాగింది. రాత్రి 9గంటల వరకు భక్తులు పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అంతరాలయ దర్శనం రద్దు