
19న అన్ని ఆర్టీసీ డిపోలలో కార్మికుల ధర్నాలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో 10 గంటల పని దినం, మహిళలు రాత్రి షిఫ్ట్లలో పనిచేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 19న అన్ని డిపోలలో ధర్నాలు, గేట్ మీటింగ్ లు నిర్వహించాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. పాతగుంటూరులోని ఆదివారం ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశం గౌరవ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా, అధ్యక్షులు సీహెచ్ సుందరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.అయ్యప్పరెడ్డి తీర్మానాలను ప్రవేశపెట్టారు. లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. దీనికి నిరసనగా రాష్ట్రంలో ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు జూన్ 19వ తేదీన అన్ని డిపోలలో గేట్ మీటింగ్లు, ధర్నాలు జరిపి నిరసన తెలియజేయాలని చెప్పారు. కండక్టర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించి 1/2019 సర్కులర్ను యథాతథంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 70లోని కార్మిక వ్యతిరేక అంశాలను రద్దు చేయాలని జూన్ 27న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని వేయాలని, ఉద్యోగులు, కార్మికులకు రావలసిన అన్ని రకాల బకాయిలను చెల్లించాలని, పెండింగ్లో ఉన్న కరువు భత్యం, బకాయిలను ఇవ్వాలని, పీఆర్సీ ఒప్పందం జరిగే లోపు 30 శాతం ఇంటీరియర్ రిలీఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులు వెయ్యాలని, డ్రైవర్, కండక్టర్, మెకానికల్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం అన్ని సంఘాలతో చర్చించి, పరిష్కరించాలని కోరారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 9,10 తేదీలలో తిరుపతిలో జరుగుతాయని తెలిపారు. ఆర్టీసీలోని ఎంపిక చేసిన కార్యకర్తలకు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి కేంద్రాలుగా మూడు సెంటర్లలో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జూలై నెలలో నిర్వహిస్తామని తెలియజేశారు.
ఎస్డబ్ల్యూఎఫ్ పిలుపు
27 విజయవాడలో రాష్ట్ర సదస్సు
అక్టోబర్ 9, 10 తేదీల్లో తిరుపతిలో
రాష్ట్ర మహాసభలు