
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
బాపట్లటౌన్: రెప్పపాటులోనే ద్విచక్రవాహనాలను మాయం చేసే ఘరానా దొంగలను బాపట్ల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం పట్టణ పోలీస్స్టేషన్లో వివరాలను అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. బాపట్ల పట్టణం ఉప్పరపాలేనికి చెందిన రాజు నాగార్జునరెడ్డి, శారదాపురి కాలనీకి చెందిన ఉన్నాం వంశీ, మల్లావుల ధర్మతేజ, షేక్ చందు, జాలాది జాన్, మరో మైనర్ బాలుడు కలసి బాపట్ల పట్టణంతోపాటు, చీరాల రూరల్, చీరాల టూ టౌన్, వెదుళ్లపల్లి, బాపట్ల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆరు ద్విచక్ర వాహనాలను, మోటర్, రెండు సవర్ల బంగారం గొలుసును దొంగతనం చేశారు. బాపట్ల పట్టణంలోని జగనన్న కాలనీకి చెందిన పాలతోటి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పట్టణంలోని గుంటూరు ఫ్లైఓవర్ వద్ద గల చిల్లర గొల్లపాలెం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా తమ సిబ్బంది ఆరుగురులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. పై తెలిపిన దొంగతనాలన్నీ తామే చేశామని అంగీకరించారు. ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రెండు సవర్ల బంగారపు గొలుసు, మోటర్ను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరిచి జైలుకు పంపిస్తామని తెలిపారు. కేసు ఛేదనలో ఎంతో కీలకంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేసిన బాపట్ల పట్టణ సీఐ రాంబాబు, ఎస్ఐ విజయ్కుమార్, ఎస్సై చంద్రావతి, సిబ్బంది ప్రభాకరరావు, మనోజ్, శ్రీనివాసరావు, పోతురాజు, కృష్ణకిషోర్లను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేకంగా అభినందించారు.
రైతుల పాలిటి ‘పగా’కు
ప్రత్తిపాడు: బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల పరిస్థితి దైన్యంగా ఉంది. తినీ, తినక ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. అటు ఉన్న ధరకు తెగనమ్ముకోలేక.. ఇటు నిల్వ చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ధర అమాంతంగా పడిపోయింది. కొనేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. పొగాకును ఏమి చేసుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. పంటను ఇంటికి తరలించలేక, ఎక్కడా నిల్వ చేయలేక ఇదిగో పొలాల్లోనే కట్టలు కట్టి, వానలకు తడవకుండా పొలాల్లోనే పట్టాలు కట్టి భద్రపరుచుకున్నారు. నల్లబర్లీకి ధర కాస్తంత పలకకపోతుందా..? ప్రభుత్వం అయినా స్పందించి కొనుగోలు చేయదా? అనే ఆశతో కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.
1,38,874 క్వింటాళ్ల నిల్వ
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, గుంటూరు రూరల్ మండలాల్లో 3,406 మంది రైతులు 11,704 ఎకరాల్లో నల్ల బర్లీ సాగు చేశారు. 1,38,874 క్వింటాళ్ల నిల్వలున్నాయి.

ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్