
చేనేత రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర
చీరాల: చేనేత రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర అన్నారు. శనివారం మండలంలోని దేవాంగపురిలోని శ్రీ చౌడేశ్వరి కల్యాణ మండపంలో బీరక సురేంద్ర ఆధ్వర్యంలో చేనేత రంగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చేనేత వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కావాల్సిన సలహాలు, సూచనలు అందించాలన్నారు. చేనేత రంగ నాయకులు అందించిన సూచనలు, సలహాలతో ఒక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వ అధికారులకు అందించి తద్వారా చేనేత రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చేనేత నాయకులు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ చేనేత సమస్యల పరిష్కారం కావాలంటే చేనేత కార్మికులు సమస్యలపై గళం వినిపించాలన్నారు. గళం వినిపించకుంటే ఏ ప్రభుత్వం కూడా ఆ వర్గాలను పట్టించుకోదన్నారు. గ్రామగ్రామాన చేనేతలు చైతన్యం కావాలన్నారు. పెద్దఎత్తున చేనేతలు కార్యక్రమాలు చేసినప్పుడే ప్రభుత్వాలే మన దగ్గరకు వస్తాయని తెలిపారు. సమావేశంలో చేనేత వృత్తి పరిరక్షణకు నూలు, సిల్క్ ధరల పెరుగుదల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం త్రిఫ్ట్, హెల్త్ ఇన్సూరెన్స్, చేనేత కార్మికుల రుణాలు, ఐఏవై గృహ నిర్మాణం పథకాలు అమలు చేయాలన్నారు. నేతన్న నేస్తం పథకం అమలు కావాలన్నారు. చేనేత సహకార సంఘాల పాలకమండలి పునరుద్ధరణ లేక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని, ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలన్నారు. చేనేత కులాల కార్పొరేషన్లు, పాలకమండలి నియమించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు దేవన వీర నాగేశ్వరరావు, చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ, చుండూరి వాసు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, మునగాల వెంకటేశ్వర్లు, బండ్ల వెంకటేశ్వరరావు, జి.రవిబాబు, కనగాల సూర్యనారాయణ, కందుల సురేష్, గోలి గిరి, గుంటూరు మల్లికార్జున గుత్తి సదాశివరావు, ఆదిశేషు, వెంకటరెడ్డి, గంజి సతీష్, భాస్కరరావు, దాశరధి, సంఘాల నాయకులు, చేనేతలు పాల్గొన్నారు.