కొరిటెపాడు(గుంటూరు): విత్తన డీలర్లు, వ్యాపారులు విత్తన నియంత్రణ చట్టం–1983కు లోబడి వ్యాపారం నిర్వహించాలని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ)యు.నరసింహారావు స్పష్టం చేశారు. స్థానిక కృషీ భవన్లో విత్తన డీలర్లు, వ్యాపారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ విత్తన లైసెన్స్ను దుకాణాల వద్ద విధిగా ప్రదర్శించాలని తెలిపారు. విత్తన నిల్వలను తప్పకకుండా ధరల సూచిక బోర్డు నందు విధిగా ప్రదర్శించాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్లు, డెలివరీ చలానాలు, బిల్లు పుస్తకాలు తప్పకుండా స్థానిక వ్యవసాయ అధికారి ద్వారా ధ్రువీకరణ చేయించుకొని ఉపయోగించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువు తీరిన విత్తనాలను నిల్వ చేయడం, విక్రయించడం నేరమని తెలిపారు. మిరప, పత్తి విత్తనాల వివరాలను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి తెలిపి, వారి ఆమోదంతో మాత్రమే విక్రయం చేయాలని ఆదేశించారు. రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని, అందులో పంట రకం, లాట్ నంబరు వివరాలు తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించారు. హెటీ(గ్లైసెల్) పత్తి విత్తనాల అమ్మకం, సాగుకు దేశంలో ఆమోదం లేదన్నారు. ఈ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా పరిధిలోని విత్తన డీలర్లు విధిగా ఫారం–డీని ప్రతి నెలా 5వ తేదీలోపు సమర్పించాలని తెలిపారు. సమావేశంలో విత్తన ఏఓ ఓ.సునీల్, డీలర్లు పాల్గొన్నారు.