తల్లికి ఆంక్షల పోటు | - | Sakshi
Sakshi News home page

తల్లికి ఆంక్షల పోటు

Jun 14 2025 7:25 AM | Updated on Jun 14 2025 7:25 AM

తల్లి

తల్లికి ఆంక్షల పోటు

సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకూ చెబుతూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పడు మాట తప్పింది. తల్లికి వందనం జాబితాకు కోతలు పెట్టేందుకు సిద్ధమైంది. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇవ్వక కొందరికే పథకాన్ని పరిమితం చేయబోతోంది. ఇందుకోసం సరికొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి ఆంక్షలు అమలుచేస్తోంది. ఒకే ఇంట్లో ఫీజురీయింబర్స్‌మెంట్‌ పొందితే ఆ ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం ఇవ్వరట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికి ఈ పథకం వర్తించదట. బియ్యంకార్డు లేకపోతే పథకం రాదట. కుటుంబం నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు. మాగాణి మూడెకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండకూడదు. పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్‌ వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగించి ఉంటే పథకం రాదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ పొందుతున్న వారికి పథకం వర్తించదు.

ప్రభుత్వ తీరుపై విమర్శలు

ఇన్ని రకాల ఆంక్షలు విధించి చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి గురువారం నుంచే పథకాన్ని అమలు చేస్తున్నామని, తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇప్పడు ఆంక్షల జాబితాను సచివాలయాలకు అప్పగించి ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఆంక్షలతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం వర్తించే అవకాశం కనిపించడంలేదు. ప్రభుత్వం వద్ద ఉన్న జాబితా ప్రకారం జిల్లాలో 1,64,124 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాను ఆంక్షలకనుగుణంగా పరిశీలన జిరిపి వడపోత పోయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది. మొత్తం బాధ్యతలను సచివాలయాలకు కట్టబెట్టింది. ఈ నెలాఖరు లోగా సచివాలయ ఉద్యోగులు ఆ బాధ్యతలను నెరవేర్చి వీలైనంతగా జాబితాలను తగ్గించాల్సి వుంది. అదే జరిగితే ఇంటిలో ఉన్న పిల్లలందరి సంగతి దేవుడెరుగు ఇంటికొక్కరికి కూడా పథకం వర్తించేలా కనిపించడంలేదు.

ఆంక్షలు ఎత్తివేయాలి

ఎన్నికల సమయంలో కూటమి నేతలు, అధికారం వచ్చాక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేయాల్సివుంది. ఇచ్చిన మాటప్రకారం చిత్తశుద్దితో పథకాన్ని చదువుకునే పిల్లలందరికీ వర్తింపు చేయక జాబితా తగ్గించుకునేందుకు పలు రకాల ఆంక్షలు పెట్టడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వాస్తవానికి పేద, మధ్యతరగతి ప్రజలు కూటమి నేతలు చెప్పిన మాటలు నమ్మి వారికి ఓట్లు వేశారు. ఇప్పుడేమో ఏరుదాటాక బోడి మల్లన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం పథకంలో కోతలు పెట్టి జనానికి వెన్నుపోటుపొడవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మనసు మార్చుకొని ఆంక్షలు పక్కనబెట్టి చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

జాబితాలో కోతల కోసం ఆంక్షలు ఇంట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తే తల్లికి వందనం ఇవ్వరట 300 యూనిట్లకు మించి విద్యుత్‌ వాడితే కట్‌ కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి వంచన గతంలో ఎంతమంది ఉన్నా ఇస్తామంటూ బూటకపు మాటలు ఆచరణ కొచ్చేసరికి జాబితా కుదింపునకు కుట్రలు ఇంటికొక్కరికి కూడా ఇచ్చే పరిస్థితి కానరాని వైనం వైఎస్‌.జగన్‌ పాలనలో జిల్లాలో 1.20 లక్షల మందికి అమ్మ ఒడి

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జిల్లాలో ఇంటి కొకరు చొప్పున ఇస్తామని చెప్పి మొత్తం 1,19,953 మంది విద్యార్థులకు అమ్మ ఒడి ఇచ్చారు. ఈ మేరకు గడచిన నాలుగేళ్లలో దాదాపు రూ. 700 కోట్లు అమ్మ ఒడి కింద చెల్లించారు. ఈ లెక్కన ఇంటికి ఇద్దరు అనుకుంటే ఈ సంఖ్య రెండింతలు కానుంది. అలా కాకున్నా గతంలో మొత్తం విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకూ వుంది. ఆ ప్రకారం అనుకున్నా విద్యార్థులు అందరికీ తల్లికి వందనం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పడు 1.64 లక్షల మందిలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిశీలన జరిపితే ఈ సంఖ్య మరింతగా తగ్గుతుందని విద్యాశాఖ అధికారులతోపాటు సచివాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. అదే జరిగితే గత ప్రభుత్వం ఇంటికొకరికి చొప్పున ఇచ్చిన అమ్మ ఒడి జాబితాకు అటు ఇటుగానే తల్లికి వందనం జాబితా ఉండే అవకాశముంది. ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం ఓట్లేయించుకొని తల్లులను వంచించినట్లే.

తల్లికి ఆంక్షల పోటు 1
1/1

తల్లికి ఆంక్షల పోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement