రుణాలు పంపిణీ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రుణాలు పంపిణీ వేగవంతం చేయాలి

Jun 14 2025 7:25 AM | Updated on Jun 14 2025 7:25 AM

రుణాలు పంపిణీ వేగవంతం చేయాలి

రుణాలు పంపిణీ వేగవంతం చేయాలి

బాపట్ల: ప్రాధాన్యత, ప్రాధాన్యత లేని రంగాలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో విస్తృతంగా రుణాలు ఇవ్వాలని వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి చెప్పారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు నూరు శాతం చేరుకోవాలని అన్నారు. గతేడాది రైతులకు ఒక లక్ష సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా, అందులో 23 వేల మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారని అన్నారు. ఈ సంవత్సరం లక్ష సీసీఆర్‌సీ కార్డుల మంజూరుకు లక్ష్యాలను నిర్దేశించారని, అందులో ఇప్పటివరకు 3,800 కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. పాత సీసీఆర్సీ కార్డులను రెన్యువల్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. సీసీఆర్సీ కార్డుదారులకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల రుణాలు ఇవ్వాలని, బ్యాంకు బ్రాంచీల ప్రకారం లక్ష్యాలను నిర్దేశించాలని ఎల్డీఎంకు సూచించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకంలో స్వయం సహాయక గ్రూపు సభ్యులను చేర్చడమైనదని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా రుణాల కోసం బ్యాంకులకు లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల పురోగతిపై జిల్లా కలెక్టర్‌ సమీక్షించారు. బ్యాంకుల వారీగా లక్ష్యాలను పూర్తి చేయకపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. జిల్లాకు 36 కిసాన్‌ డ్రోన్‌ యూనిట్లను లక్ష్యంగా ఇచ్చారని తెలిపారు. జిల్లాలో ఒక లక్ష 60 వేల మంది రైతులు ఉన్నారన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం కింద కౌలు రైతులను పంట బీమా చేయించాలని, బీమా వలన కలిగే ప్రయోజనాలను వివరించి వారికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ బ్యాంకర్లకు సూచించారు.

ఉత్పత్తి రంగాలకు రుణాలు ఇవ్వాలి

ఉత్పత్తి రంగాల అభివృద్ధికి అధిక రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ వెంకట మురళి తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ప్రాధాన్యత, ప్రాధాన్యత లేని రంగాలను కలిపి 7.51 లక్షల మందికి రుణాలు ఇచ్చి ఆయా ఉత్పత్తులు పెంచుకోవడానికి రూ.15 వేల 820 కోట్లు రుణాలు ఇవ్వాలని వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో రూ.13 వేల 444 కోట్ల వార్షిక లక్ష్యానికి రూ.16 వేల 603 కోట్ల రుణం మంజూరు చేసినట్లు బ్యాంకర్లు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. సమావేశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, నాబార్డ్‌ డీడీఎం రవికుమార్‌, ఆర్బీఐ ఎల్డిఓ నవీన్‌ బాబు, యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ అధికారి మాధురి, ఎల్‌డీఎం శివకృష్ణ, వివిధ బ్రాంచీల బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement